విజయవాడ : సీనియర్ జర్నలిస్టు శ్రీ వీరాజీ(81) హైదరాబాద్ నివాస గృహంలో బుధవారం కన్నుమూసారు..వీరికి భార్య, ఇద్దరు కుమారులు. విజయనగరం లో 1940 జులై 30 తేది జన్మించిన వీరాజీ ఐదు దశాబ్దాలు పైగా జర్నలిజం తన ఊపిరిగా జీవించారు….సుదీర్ఘ కాలం ఆంధ్రపత్రిక…అనుబంధ కలువబాల…పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రధానంగా ‘‘ముచ్చట్లు’’ శీర్షిక రసరంజకంగా నిర్వహించారు.1973-75 మధ్య కాలంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొనసాగారు. చివరి దశలో కొంతకాలం కృష్ణా పత్రిక బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘వీరాజీయం’’…’’బెజవాడ బాతాఖాని’’…శీర్షికలను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా నిర్వహించారు. అలాగే వివిధ పత్రికల్లో పాఠక మనోరంజకమైన పలు శీర్షికలను నిర్వహించారు…. అన్నింటికి మించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకుని ఐదు దశాబ్దాల పాటు తన పాత్రికేయ జీవనంలో ఎన్నో కధలు, నవలలు, కధాసంకలనలు రచించారు.
శ్రీ వీరాజీ మరణం పట్ల ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్. వసంత, యూనియన్ అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవికుమార్, కొండా రాజేశ్వరరావు తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. నిమ్మరాజు చలపతిరావు ఆంధ్రపత్రిక లో దశాబ్ద కాలం పైగా వీరాజీ తో పనిచేసిన తనకు నాటి జ్ఞాపకాలు…స్మృతులు తను ఎన్నటికీ మరువలేనని అన్నారు. శ్రీ వీరాజీ గారు విజయవాడలో చివరిసారి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన శ్రీ శివలెంక శంభుప్రసాద్ శత జయంతోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు.