కీలక నేతల మౌనం
దాడులతో కార్యకర్తల్లో ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం అనంతరం వైసీపీ కీలక నేతలు మౌనం దాల్చారు. ఆ పార్టీలో జోష్ సన్నగిల్లింది. తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని ఊహించుకున్న నేతలకు ఫలితాలు తిరగడటంతో అయోమయంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014, 2019 ఎన్నికలతో పోల్చుకుంటే… వైసీపీ ఘోరపరాజయం పాలైంది. ఓటమి అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పార్టీ అధినేత వైఎస్ జగన్ పరిమితమయ్యారు. ఓటమికి అనేక కారణాలు చూపుతున్నప్పటికీ… ఓడిన వారిలో చాలా మంది ఇంకా తేరుకోలేకపోతున్నారు. వైసీపీలో కీలక నేతలు, సీనియర్లు జగన్కు టచ్లోకి లేకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. పార్టీలో అన్నీ తానై చూసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు సజ్జల భార్గవ్ ఎక్కడా మీడియా ముందుకు రావడం లేదు. ఫలితాల రోజు నుంచి ఆయన ఎక్కడ ఉన్నారో అంతుచిక్కడం లేదు. అసలు జగన్ను సజ్జల కలిశారా?, లేదా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. సజ్జలపై సొంత నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన తీరును ఎండగడుతున్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఓటమి అనంతరం మౌనంగా ఉండిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించగా, ఈ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీకి దిగడంతో ఆయన పాత్ర తగ్గింది. నెల్లూరులో మీడియా ముందుకు వచ్చి ఓటమిపై పార్టీలో చర్చించుకుంటామని ఆయన వెల్లడిరచి, అనంతరం ఎక్కడా కనిపించడం లేదు. ఇంతవరకు జగన్తో విజయసాయి రెడ్డి భేటీ అయిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు నుంచి జగన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపు లోనూ తన అనూయులకు టికెట్లు కేటాయించకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పుడు ఓటమి పాలవ్వడంతో పక్కచూపులు చూస్తున్నట్లుగాను, జనసేన నేతలతో ఆయన టచ్లోకి వెళ్లినట్లుగా ప్రచారం ఉంది. వైసీపీలో ఓటమి పాలైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్పై మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఎలాంటి మార్పులు చేపట్టకపోయినప్పటికీ, సీనియర్ మంత్రిగా పని చేసిన బొత్సతో పాటు అందరూ ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ సోదరులూ ఓటమి నుంచి తేరుకోలేదు. అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన తమ్మినేని సీతారామ్, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి తదితరులు ఓటమితో అయోమయంలో పడ్డారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కాపు సామాజికవర్గం మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల్లో అత్యధిక శాతం మౌనంగా ఉన్నారు.
దాడులతో వైసీపీ శ్రేణుల కలవరం
రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై టీడీపీ, జనసేన కార్యకర్తలు చేస్తున్న దాడులపై ఆ పార్టీ శ్రేణులు కలవరం చెందుతున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు కూడా అందుబాటులో లేరు. వైసీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి, వారిని బయటకు లాగి తన్నడం, ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేయడం లాంటి విధ్వంసక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తను అర్థనగ్నంగా మోకాళ్లపై నిలబెట్టి, టీడీపీ నాయకుడు నారా లోకేశ్ ఫ్లెక్సీకి దండాలు పెట్టించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇదే తరహాగా గుంటూరు, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఘోర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి, అక్కడ హెచ్చరిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నప్పటికీ, అధిష్టానం నుంచి తమకు అండదండలు లేవని కార్యకర్తలు వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి, స్థానిక నేతల నుంచి న్యాయపరంగా, పార్టీ పరంగా మద్దతు లేకపోవడం వెరసి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను నేతలు విస్మరిస్తున్నారని వాపోతున్నారు.