మోదీ, జగన్ది అహంభావ పాలన: వనజ
విశాలాంధ్ర-విజయవాడ (చిట్టినగర్):కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అహంభావపూరితపాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి జీ కోటేశ్వరరావుకు విజయం చేకూర్చాలని కోరుతూ గురువారం కరపత్రాలతో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వనజ మాట్లాడుతూ మోదీ, జగన్ అధికారంతో వ్యవస్థలను అడ్డం పెట్టుకొని పాలన సాగిస్తూ అదానీ అంబానీలకు, ఇతర కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, గృహ పరిశ్రమల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. ప్రభుత్వ మద్దతు లేకపోవడం, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, కార్పొరేట్ సంస్థల పోటీని తట్ట్టుకోలేక నష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు. కేసుల భయంతోనే జగన్… కేంద్రంపై ఒత్తిడి చేయకుండా రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రగతి ఇండియా కూటమితోనే సాధ్యమన్నారు. పశ్చిమ అభ్యర్థి కోటేశ్వరరావు కంకి కొడవలి, విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ హస్తం గుర్తుపై ఓట్లు వేసి వీరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భవానిపురంలో అభ్యర్థితో పాటు విజయవాడ ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్ అధ్యక్షుడు గుర్రం రమణయ్య, ప్రధాన కార్యదర్శి కొనకొళ్ల చిన్న, వాసవి గుడి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కమిటీ సభ్యులు ఐరన్ యార్డ్ కాంప్లెక్స్ నాలుగు ప్రధాన రోడ్లలో షాపు యజమాలను కలిసి కరపత్రాలు అందజేసి ఓట్లను అభ్యర్థించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, పంచదార్ల దుర్గాంబ, పి. రాణి, కే రమణరావు, టీ వెంకటేశ్వరరావు, కే రాజు, గురునాథం, కిషోర్, ఎస్.కె. నజీర్, ముఠా కార్మిక నాయకులు ఉన్నారు.