. సోనియాగాంధీ ఆశాభావం
. కరుణానిధికి కూటమి నేతల నివాళి
న్యూదిల్లీ : లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి హోరాహోరీ తలపడ్డాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఇండియా కూటమి’ ఆశావహ దృక్పథంతో ఉంది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీన ఎన్డీఏ కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 100 లేదా 150 సీట్లు వస్తాయని, దీంతో మరోసారి ఎన్డీఏనే అధికారం లోకి వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందిం చారు. ఎగ్జిట్ పోల్ అంచనాలు కాదు.. ఎవరు గెలుస్తారన్నది ఎన్నికల ఫలి తాల దాకా వేచి ఉండాలని సోనియాగాంధీ అన్నారు. కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 100వ జయంతి (జూన 3) సందర్భంగా దిల్లీలోని డీఎంకే కార్యాలయానికి వెళ్లి సోనియాగాంధీ ఆయనకు నివాళులర్పించారు. సోనియాగాంధీతోపాటు ఇండియా కూటమి లోని మరికొన్ని పార్టీల నేతలు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు టీఆర్ బాలు, తిరుచ్చి శివ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డీఎంకే కార్యాలయంలో కరుణానిధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికల ఫలితాల కోసం మనందరం వేచి ఉండాలి. ఎగ్జిట్పోల్స్కి వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. డాక్టర్ కలైంగర్ కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా నా సహచరులతో ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. నేను అనేక సందర్భాల్లో కరుణానిధిని కలిశాను. ఆయన చెప్పే సలహాలు, సూచనలు ఎంతో ప్రయోజనం కలిగించాయి. ఆయనను కలవడం అదృష్టంగా భావిస్తున్నా’ అని సోనియా అన్నారు.