కొనసాగుతున్న చేరికల పర్వం
అధికార పార్టీకి షాకులమీద షాకులు
ఎస్సీ, ఎస్టీ స్థానాలపై షర్మిల ఫోకస్
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో అధికార వైసీపీ వీడుతున్న నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సీట్ల కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అసంతృప్త నేతలు ప్రధానంగా కాంగ్రెస్పై దృష్టి సారించారు. దీంతో కాంగ్రెస్లో చేరికల పర్వం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో కాంగ్రెస్పై అభిమానమున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు కాంగ్రెస్లో చేరిన వారిలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలే అధికంగా ఉన్నారు. తాజాగా నంద్యాల వైసీపీ జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇది వైసీపీ ఆదిష్ఠానానికి పెద్ద షాక్గా మారింది. పార్టీనుంచి నిత్యం ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు చేజారుతుండటంతో రాబోయే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామన్న ఆ పార్టీలో కలవరం మొదలైంది. నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి కొంతకాలం నుంచి పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో హైదరాబాద్లో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక పోలవరం నియోజకవర్గానికి చెందిన కీలక మహిళా నేత దువ్వెల సృజన కూడా వైసీపీకి రాజీనామా చేశారు. సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే ధార సాంబయ్య కుమార్తె ధార పద్మజ వైసీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరారు. వారిద్దరికీ షర్మిల కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వైసీపీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. రాబోయే ఎన్నికల్లో వారికి వైసీపీ ఆధిష్ఠానం టికెట్లను నిరాకరించడంపై అసంతృప్తికి గురయ్యారు. వైసీపీ పూర్తి జాబితా విడుదలలోనూ వారి పేర్లు లేవు. దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన రోజే, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీలో చేరారు. అనంతరం కొన్ని కారణాల వల్ల నెల రోజుల్లోనే ఆయన మళ్లీ తిరిగి వైసీపీ గూటికి వచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్లో చేరికలు ఎక్కడా ఆగడం లేదు. వరుస వారీగా షర్మిల నాయకత్వంలో ఎమ్మెల్యేల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు చేరుతున్నారు. ఇవి పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇటీవల శ్రీ కాళహస్తి ఆలయ మాజీ చ్కెర్మన్ పోతుగుంట గురవయ్య, పోలవరంలో మాజీ ఎమ్మెల్యే తనయుడు బాడిసే బొజ్జి పార్టీలో చేరారు. అటు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నియామక ప్రక్రియనూ షర్మిల వేగవంతం చేశారు. జిల్లాల వారీగా సోషల్ మీడియా, మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, కిసాన్ సెల్, యువజన కాంగ్రెస్ కమిటీలను నియమించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆమె కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల అమలు తదితర అంశాలపై ప్రధానంగా షర్మిల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అనంతపురం, విశాఖపట్నాలలో కాంగ్రెస్ బహిరంగ సభలు నిర్వహించారు.