. కొన్ని డిమాండ్లపైనే సానుకూలత
. ఆచరణ శూన్యం…వెలువడని ఉత్తర్వులు
. సీఎస్తో ఉద్యోగ సంఘాల చర్చలు నిష్ఫలం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. చర్చలకు పిలిచి… ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేయడమే కానీ ఆచరణ శూన్యంగా కనిపిస్తోంది. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిష్ఫలంగానే ముగిసింది. గత సమావేశాల తరహాలోనే మొక్కుబడిగా ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి 16 జాయింట్ స్టాఫ్ సభ్య గుర్తింపు ఉద్యోగ సంఘాల నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్టీయూ నుంచి రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎల్.సాయిశ్రీనివాస్, మల్లు రఘునాథరెడ్డి చర్చల్లో పాల్గొని ఉద్యోగుల సమస్యల్ని వివరించారు. వివిధ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై చర్చకు పట్టుపట్టారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ గతంలో మంత్రివర్గ ఉప సంఘం అధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక అంశాలపై చర్చించారని… వాటిపై వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. ఆ సమయంలో అనేక ఆర్థిక అంశాలకు హామీ ఇవ్వగా… వాటిపై ఉత్తర్వులు మాత్రం రావడం లేదు. ప్రస్తుత సమావేశంలో కేవలం ఆర్థికేతర అంశాలనే తన దృష్టికి తీసుకురావాలని సీఎస్ సూచించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. కొన్ని అంశాలపైనే అధికారులు సానుకూలతను చూపారు. ప్రధానంగా వైద్యారోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు స్వాగతించారు. 12వ పీఆర్సీలో ఐఆర్ ఇవ్వాలని, వివిధ క్యాడర్లకు గెజిటెడ్ హోదా పీఆర్సీతో సంబంధం లేకుండా ఇవ్వాలని కోరారు. పంచాయితీ రాజ్ శాఖలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు చాలా కాలం నుంచి పెండిరగ్లో ఉన్న పదోన్నతులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్లుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. డీఏతోపాటు 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరారు. ఆయా అంశాలపై సీఎస్ సానుకూలంగా స్పందించారేగానీ ఉత్తర్వులకు ఆదేశించలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కేవలం ఎన్నికల సమయంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత లేకుండా ఉండాలనే దిశగా చర్చల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో కేవలం చర్చలతోనే కాలయాపన చేస్తున్నారని, ఉద్యోగుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై చొరవ చూపడం లేదంటున్నారు.
ఇదే వైఖరితో ప్రభుత్వం ఉంటే… ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగుతాయని పేర్కొంటున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలంటూ ఇటీవల ఏపీ ఎన్జీవోల సంఘం నేతలు చలో విజయవాడకు పిలుపునిచ్చాయి.దీంతో తక్షణమే మంత్రివర్గ ఉప సంఘంతో చర్చలకు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించారు.
ఆ చర్చలు ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ పిలుపు తనకు తెలియదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం మళ్లీ జరిగిన చర్చల్లోనూ వారి డిమాండ్లను మంత్రివర్గ ఉప సంఘం పరిష్కరించలేకపోయింది. ఆర్థికేతర అంశాలను పరిష్కరించాలంటూ సీఎస్కు సూచించామని దాటవేశారు. అనంతరం ఉద్యోగ సంఘాలతో సీఎస్ నిర్వహించిన సమావేశంలోనూ ప్రధాన సమస్యలపై స్పష్టత రాలేదు.