. కడప లోక్సభకు చెల్లెమ్మ
. పులివెందుల అసెంబ్లీకి పిన్నమ్మ
. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్?
. ప్రత్యక్ష పోరుకు కుటుంబసభ్యులు సిద్ధం
. వివేకా హత్య చుట్టూ కడప రాజకీయం
. నేడు కాంగ్రెస్ కార్యకర్తలతో షర్మిల భేటీ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : గత శాసనసభ ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఈసారి అదే అంశం ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారబోతోంది. వివేక హత్యకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ఆరోపించి ఓటర్ల సానుభూతి పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఆ హత్యకు కారకులెవరో ఐదేళ్లుగా తేల్చలేకపోయారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరిన జగన్… ఆ తర్వాత అవసరం లేదని చెప్పారు. అంతేగాక సీబీఐ దర్యాప్తు చేపట్టి నిందితులుగా పేర్కొన్న వారికి కూడా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని వివేక కుమార్తె సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో దోషులెవరో తేల్చాలంటూ సునీత ఐడేళ్లుగా పోరాడుతున్నారు. ఆమెకు సీఎం జగన్ సొంత చెల్లెలు షర్మిల సైతం అండగా నిలిచారు. ఇటీవల వివేకానందరెడ్డి సంస్మరణ సభలో వీరిద్దరూ ప్రజాకోర్టులోనే న్యాయం కోరతామని శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయవద్దని ఇదే వేదికగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివేక కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని వైసీపీ అధిష్ఠానం మళ్లీ కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయనపై షర్మిల కానీ, సునీత కానీ పోటీ చేస్తారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. దీనితోపాటు కడప నుంచి పోటీ చేస్తారా ? లేక విశాఖ నుంచి చేస్తారా ? అనే చర్చ కూడా జరుగుతోంది. షర్మిల సొంత జిల్లా కడప నుంచి పోటీచేస్తేనే తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఏఐసీసీ నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో విజయవాడ ఆంధ్రరత్న భవన్లో గురువారం కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో షర్మిల సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కడప నుంచి షర్మిల పోటీపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆమె రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తొలుత ఆమె విశాఖ నుంచి రంగంలోకి దిగాలని, వివేక సతీమణి సౌభాగ్యమ్మను కడప ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచన చేశారు. దీనిలో భాగంగానే విశాఖలో ఇటీవల ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి వైసీపీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత అనుభవాల దృష్ట్యా షర్మిల విశాఖ కంటే సొంత జిల్లా కడప నుంచి పోటీచేయాలని పార్టీ సీనియర్లు కోరినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం సైతం కడప నుంచి పోటీ చేయాలని కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం. కడపకు చెందిన పార్టీ నేతలతో షర్మిల గురువారం సమావేశమవుతుండటంతో ఆమె కడప నుంచి పోటీ చేయవచ్చనే అంచనాలకు బలం చేకూరినట్లైంది.
షర్మిల కడప నుంచి బరిలోకి దిగితే పోరు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. వివేక సతీమణిని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని స్థానిక కాంగ్రెస్ నేతలు పీసీసీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. వివేక హత్య తర్వాత సీఎం జగన్, ఎంపీ అవినాశ్రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అందువల్ల పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ, కడప ఎంపీకి షర్మిల పోటీ చేస్తే విజయం సునాయాసమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. పీసీసీ అధినేత దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.