. నేతల సభలు, రోడ్షోలు
. బిజీబిజీగా అభ్యర్థులు
. తుది వ్యూహాల్లో పార్టీలు
. 13న ఎన్నికలకు సన్నద్ధం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు, నేతలు చివరి అస్త్రాలు, వ్యూహాలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకుగాను ఇండియా కూటమి తరపున కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా… ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) పక్షాలు సీట్ల సర్దుబాటుతో బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. అదే దిశగా లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ముమ్మర ప్రచారంలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు సుడిగాలిలా పర్యటిస్తున్నారు. ఇండియా కూటమి నేతల విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో సీపీఐ నేత రామకృష్ణ రోడ్షోలు నిర్వహించారు. ఆయా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను, బీజేపీకి మద్దతు పలుకుతున్న పార్టీలను ఎండగడుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ నేత షర్మిల బస్సు యాత్ర పూర్తి చేశారు. ఆమె అడుగడుగునా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీపైన ఆ పార్టీతో పొత్తుకు దిగిన టీడీపీ, రహస్య అవగాహనతో ముందుకు సాగుతున్న వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీకి ఓట్లు వేస్తే… మతోన్మాద బీజేపీకి వేసినట్లేనంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పక్షాల నుంచి 16 మంది తిరుగుబాటు దారులుగా పోటీలో ఉన్నారు. వారంతా పోటాపోటీగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ కమార్ మీనా చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఆర్ఫీ బలగాలను మోహరించనున్నారు.
సిద్ధం నినాదంతో వైసీపీ
ఈ ఎన్నికల్లో వైసీపీ ‘సిద్ధం’ నినాదంతో ప్రచారం చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే..నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టారు. అక్కడితో ఆగకుండా మేమంతా సిద్ధం పేరుతో 22 రోజులపాటు 86 నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తిచేశారు. ఆ తర్వాత రోజుకు మూడు చొప్పున మూడు ప్రాంతాల్లో జగన్ సభలు కొనసాగుతున్నాయి. వాటికితోడుగా జగన్ కోసం మేమంతా కార్యక్రమాన్ని వైసీపీ రూపొందించింది. దీని ద్వారా వైసీపీ మేనిఫెస్టోను బూత్లెవెల్ కార్యకర్తలు, స్టార్ క్యాంపెయినర్లు ఇంటింటా ప్రచారం చేస్తారు. మరో వైపు వైసీపీ ఎన్ఆర్ఐల సహకారంతో జగన్ కోసం సిద్ధం ప్రచారాన్ని చేపడుతున్నారు. ఎన్ఆర్ఐల సహకారంతో ఏర్పాటు చేసిన నాలుగు బస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ఇందులో ఎన్ఆర్ఐలతోపాటు స్టార్ క్యాంపెయినర్లు, వైసీపీ ముఖ్యనేతలు ఉంటారు. ఈ ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ… విభిన్న రూపాల్లో ప్రచారం చేపడుతోంది. 2019 మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేశామని ఆ పార్టీ అధినేత జగన్ చెబుతున్నారు. 2014లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటీ అమలు చేయలేదని, మళ్లీ అమలుకాని హామీలిచ్చారంటూ బహిరంగ సభల్లో విమర్శిస్తున్నారు.
జగనే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ విమర్శలు
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, టీడీపీ, జనసేన ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్లు సీఎం జగనే లక్ష్యంగా బహిరంగ సభల్లో ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని, రాష్ట్రం అప్పులమయమైందని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని హామీలిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తరపున ఉమ్మడిగా చిలకలూరిపేట వేదికగా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికలకు శంఖారావం పూరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అక్కడక్కడా పర్యటించారు. ఇక ప్రచార ఘట్టం తుది దశకు చేరుకోవడంతో… మరోసారి ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట, విజయవాడ లోక్సభ పరిధిలో మోదీ ప్రచారం నిర్వహిస్తారు. మోదీ పర్యటన విజయవంతం చేయడానికి టీడీపీ, బీజేపీ, జనసేన సమాయత్తమవుతున్నాయి.
ఎన్డీఏ కూటమిలో గందరగోళం
ఎన్డీఏ కూటమి పార్టీల ప్రచారంలో గందరగోళం ఏర్పడిరది. ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ను ముద్రించలేదు. కేవలం చంద్రబాబు, పవన్ ఫోటోలే ఉండటంతో ఎన్డీఏలో సమన్వయ లోపం స్పష్టమైంది. ఈ మేనిఫెస్టోను బీజేపీ కేవలం ఆశీస్సులతోనే సరిపెట్టింది. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు జారీజేసిన ఎన్నికల ప్రకటనల్లో పవన్ ఫోటో కనిపించలేదు. కేంద్రంలోని బీజేపీతో పొత్తులో కొనసాగితే..తమకు మైనార్టీల ఓట్లు దూరమవుతాయన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. ఇటీవల ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశంపై ఏర్పడిన వివాదమూ టీడీపీ, జనసేనకు తలనొప్పిగా మారాయి. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ ఫోటోలు ముద్రిస్తే…టీడీపీకి మహిళా ఓటర్లు దూరమవుతారన్న ప్రచారముంది. దీంతోనే వ్యూహాత్మకంగా మోదీ, పవన్ బొమ్మలను తొలగించారన్న విమర్శలున్నాయి.