. కేరళ సహా బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
. సమస్యలు సృష్టించడానికే గవర్నర్లా? : కేరళ సీఎం పినరయి విజయన్ బ దిల్లీలో మహాధర్నా
న్యూదిల్లీ: దేశంలో సమాఖ్య విధానా(ఫెడరలిజం)న్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కేరళ పోరాడుతోందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో తమ రాష్ట్రానికి అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఆయనతో పాటు కేరళ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) నేతలు ధర్నాలో పాల్గొన్నారు. తొలుత వారంతా కేరళ హౌస్ నుంచి జంతర్మంతర్ వరకు ర్యాలీగా వచ్చారు. దిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్ కూడా నిరసన వేదిక వద్దకు వచ్చి తమ సంఫీుభావాన్ని ప్రకటించారు. మరోపక్క కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ ధర్నాలో పాల్గొనేందుకు నిరాకరించగా… కన్నడ నేతలు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. మహాధర్నాను ప్రారంభించిన విజయన్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఫిబ్రవరి 8ని చారిత్రాత్మక దినంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేసే వ్యవస్థపై కేరళ కూడా నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్రం.. కేరళ, ఇతర బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కేరళ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు.. కేరళ అనేక రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిందని, కానీ కేంద్రం ఆ విజయాలను శిక్షించే విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రం అడిగే ఏడిమాండ్నూ కేంద్రం వింటున్నట్టు లేదని, ఆర్థిక సంఘం రాష్ట్ర మార్గదర్శకాలను ఆమోదించదని పేర్కొన్నారు. లైఫ్ భవన్ పథకంలో భాగంగా ఈ ఏడాది జనవరి 22 వరకు 3,71,934 ఇళ్లను నిర్మించగా, 32,751 ఇళ్లకు మాత్రమే పీఎంఏవై గ్రామీణ్ నుంచి రూ.72,000 చొప్పున సాయం అందిందని వెల్లడిరచారు. పీఎంఏవై అర్బన్లో భాగంగా కేంద్రం 80,259 ఇళ్లకు కేంద్రం రూ.1,50,000 ఇచ్చిందని, రెండు పథకాల లబ్ధిదారులకు మిగిలిన మొత్తం నాలుగు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. మొత్తం మీద 1,13,010 కుటుంబాలు (30.38%) నామమాత్రంగా కేంద్ర సహాయం పొందాయని తెలిపారు. సమైక్యాన్ని అస్థిరపరిచేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయని తెలిపారు. కానీ ప్రధాని మాత్రం దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ఐక్యతకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఐక్యత, లౌకికవాదాన్ని కొనసాగించడానికి దక్షిణ భారత రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని సామాన్యులకు, మధ్యతరగతికి ఏమీ చేయరాదన్నది కేంద్ర వైఖరిగా ఉందని తెలిపారు. పోరాటాల ద్వారా ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కూడా వినూత్న మార్గాలను అన్వేషిస్తోందని స్పష్టం చేశారు. కేరళ పన్ను ఆదాయంగా రూ.79 వసూలు చేస్తుండగా కేంద్రం రూ.21 ఇస్తోంది. అదే యూపీకి 100కి 46, బీహార్కు 70, కేరళకు మాత్రం 21. ఇది వివక్ష కాకపోతే ఏమిటని ప్రశ్నించారు. వరదలు, అంటువ్యాధులు వచ్చినా నిలబడి పోరాడిన చరిత్ర కేరళకు ఉందన్నారు. గవర్నర్ ను ఉపయోగించుకుని సమస్యలు సృష్టించే పద్ధతి రాష్ట్రంలోనూ అమలవుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర శాసనసభలను అదుపులో ఉంచుకునే ఇంపీరియల్ రెసిడెంట్ల మాదిరిగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారన్నారు. దీని వల్ల ఫెడరలిజం, ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయ పోరాటాలు, ప్రజా పోరాటాలు అవసరమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా రోడ్డుపై కూర్చున్న గవర్నర్ కార్యకలాపాలకు కేరళ వేదికైందన్నారు. ఛాన్సలర్షిప్ను ఉపయోగించడం వల్ల విశ్వవిద్యాలయాల పనితీరు కూడా తారుమారైందని, పాలసీ ప్రకటన చదవడానికి సమయం లేకున్నా గవర్నర్కు రోడ్డుపై కూర్చునే సమయం ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమస్యలన్నింటినీ వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి అందించామని, అన్ని విధాలా ప్రయత్నించినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇంత పోరాటానికి దిగామని తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా మౌనంగా ఉండలేమని ముఖ్యమంత్రి విజయన్ అన్నారు. సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపిన వారందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిపక్ష ప్రభుత్వాలపై కేంద్రం యుద్ధం: కేజ్రీవాల్
మహాధర్నాలో పాల్గొన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సర్కారు యుద్ధం చేస్తోందన్నారు. ‘దేశంలోని 70 కోట్ల మంది ప్రజలకు ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై బీజేపీ యుద్ధం చేస్తోంది. ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకు కేంద్రం అన్ని వ్యూహాలను ఉపయోగిస్తోంది’ అని కేజ్రీవాల్ మండి పడ్డారు. గవర్నర్లు, ఎల్జీలను అడ్డు పెట్టుకుని రాష్ట్రాలను పనిచేయనివ్వడం లేదని, ప్రతిపక్ష నేతలను వేధించేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందన్నారు. ‘నేను 2 కోట్ల మంది ప్రజల హక్కును అడిగేందుకే ఇక్కడికి వచ్చాను. మీరు నిధులు ఇవ్వకుంటే మేము రోడ్లు ఎలా నిర్మిస్తాం, విద్యుత్ సౌకర్యం ఎలా కల్పిస్తాం, అభివృద్ధికి ఎలా కృషి చేస్తాం’ అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ను ఉదహరిస్తూ, గ్రామీణాభివృద్ధి నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల అంశాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్నారని, ప్రతిపక్ష నేతలను ఇరికించేందుకు ఈడీ వంటి ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘వారు హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారు, ఇప్పుడు వారు నన్ను కూడా అరెస్టు చేయవచ్చు. వారు ఎవరినైనా అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జైలుకు పంపవచ్చు’ అన్నారు. బీజేపీ నియంతృత్వ, అహంకార ధోరణిని విడనాడాలని హితవు పలికారు.