పోరాటానికి ప్రతిరూపం అంబేద్కర్
. మరణం లేని మహానేత… పేదల పక్షపాతి
. స్ఫూర్తి నింపేందుకే ‘ఈ సామాజిక న్యాయ మహాశిల్పం’
. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో జగన్
. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: పోరాటానికి ప్రతిరూపం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన మరణం లేని మహానేత అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. విజయవాడ నగరం నడిబొడ్డున 18.18 ఎకరాల విస్తీర్ణంలో రూ.404.35 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని, స్మృతివనాన్ని సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించారు. దీనికి ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జగన్ మాట్లాడుతూ విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే మనం ఈ దేశంతోనే కాదు… ప్రపంచంతోే పోటీపడుతున్నామని, అందరిలో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఆకాశమంత ఈ మహానుభావుడిని తరతరాలు గుర్తు చేసుకోవాలన్నారు. ఇక మీదట ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ అంటే భారత్లో విజయవాడ పేరు మారు మోగుతుందన్నారు. భావి భారత పౌరులు ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని, ఎందుకంటే అభివృద్ధికీ, అభ్యుదయానికీ మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలమన్నారు. ఆయన భావజాలానికనుగుణంగా వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం అవిరళ కృషి చేస్తోందని జగన్ అన్నారు. తమ పార్టీ తరపున శాసనమండలిలో 29 మంది ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీలు ఉన్నారని, ఎనిమిది మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం మంది ఎస్సీ, బీసీలేనని చెప్పారు. 13 జడ్పీ చైర్మన్లకుగాను 9 మంది బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చామని, 84 మున్సిపాలిటీల్లో 58 మంది, 196 మార్కెట్ కమిటీ చైర్మన్లలో 117 మంది, 137 కార్పొరేషన్ చైర్మన్లలో 79 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులే ఉన్నారని వివరించారు. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం, 50 ఇళ్లకు ఒక వలంటీర్, వారి ద్వారా లంచాలు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు, రైతన్నకు, ప్రతి పేదవాడికీ సహాయం చేయడంతో అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. ఇవన్నీ సామాజిక న్యాయం అందించడంలో విప్లవంగా పుట్టిన వ్యవస్థలన్నారు. ప్రస్తుతం ప్రారంభించుకున్న ఈ సామాజిక న్యాయ మహాశిల్పం మనం ఆచరించిన విధానాలకు ప్రతీక అని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా అని సీఎం ప్రశ్నించారు. పేదలు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పేదల జీవన ప్రమాణస్థాయి పెంపు లక్ష్యంగా నవరత్నాల పేరుతో సంక్షేమానికి ఏపీని చిరునామాగా మార్చామని జగన్ అన్నారు. ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు.పెత్తందారుల పార్టీలు వీటిని సహించలేకపోతున్నాయని పరోక్షంగా విపక్షాలపై ఆరోపణలు చేశారు. అందుకే పేదలకు ఇచ్చే ఇళ్లకు, స్థలాలకు, ఇంగ్లీషు మీడియం అమలుకు అడ్డుపడుతున్నాయన్నారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరానితనం. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం అంటరానితనమే. పేద పిల్లలకు ట్యాబ్లు ఇస్తుంటే కుట్రపూరిత వార్తలు రాయడం కూడా అంటరానితనం కిందకే వస్తుందని జగన్ విమర్శించారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు రూపం మార్చుకున్న అంటరానితనం కిందకే వస్తుందన్నారు. పథకాల అమలులో వివక్ష చూపించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని సీఎం స్పష్టం చేశారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని, పెత్తందారీ పార్టీలకు, పెత్తందారీ నేతలకు పేదలు గురించి పట్టదని, పేద కులాల వారు ఎప్పటికీ సేవకులుగానే ఉండాలని వారు కోరుకుంటారన్నారు. పేదలకు అండగా ఉండాలని ఈ పెత్తందారీ పార్టీలకు ఎందుకు ఆలోచన రాదో అర్థం కావడం లేదన్నారు. అంబేద్కర్ భావజాలం ఈ పెత్తందారులకు నచ్చదని, పెత్తందారులకు దళితులంటే చులకనని, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఏ కోశానా ప్రేమ లేదని ఆయన ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించారు. ‘మనందరి ప్రభుత్వంలో మీ బిడ్డ పాలనలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామాన్ని పరిశీలించండి. మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఇంటింటా చదువుల విప్లవం, మహిళా సాధికార విప్లవం, పరిపాలనా సంస్కరణలు, వైద్య, విద్యారంగాల్లో భారీ మార్పులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాలు… ఇలా అనేక మార్పులు కనిపిస్తాయి. ప్రతి అంశంలోనూ పేదల అభ్యున్నతి లక్ష్యంగా తీసుకుంటున్న మీ బిడ్డ నిర్ణయాలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’ అని జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంత్రులు తానేటి వనిత, మేరుగ నాగార్జున, జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, నందిగం సురేశ్, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, సీఎస్ జవహర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.