. నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి మేలే
. కేంద్ర బడ్జెట్పై సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణానికి నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి మేలే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్పై మీడియా వద్ద ఆయన స్పందించారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు.
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాజధాని నిర్మాణానికి నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి మేలే జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్పై మీడియా వద్ద ఆయన స్పందించారు. తాము పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తాం. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తాం అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీపై సీఎం స్పందిస్తూ, నిధులు ఏ రూపంలో వచ్చినా రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని, రాజధాని నిర్మాణం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపయోగకరమన్నారు. ఏజెన్సీల నిధులు అప్పు రూపంలో అయినా 30 ఏళ్ల తర్వాతే తీర్చాల్సి ఉంటుందన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుందని, దీనికి మరికొంత గ్రాంట్ కూడా కలిపి ఉంటుందని వివరించారు. కొంత కేంద్ర గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో కలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంతమేర నిధులు అని స్పష్టంగా బడ్జెట్లో పెట్టలేదని, పోలవరం పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందన్నారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా సాయం ఉంటుందని సమాచారం ఉందన్నారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉందని, నిబంధనలు పరిశీలించాక రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.