. ఎమ్మెల్యేల నివాసాలు ముట్టడిరచిన అంగన్వాడీలు
. అరెస్టులు… ఉద్రిక్తత
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూల అనుబంధ సంఘాల అధ్వర్యాన శాసనసభ్యుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్రావు కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిని ముట్టడిరచారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి నినాదాలు చేశారు. విజయవాడలో ధర్నా చౌక్ నుంచి ఎమ్మెల్యేల ఇంటికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తోపులాటలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, అంగన్వాడీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతపురంలో మంత్రి ఉష శ్రీచరణ్ ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. సమ్మె చేస్తున్న శిబిరం నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని ముందుకు వెళ్లనీయకుండా కట్టడిచేశారు. అంగన్వాడీలు ప్రభుత్వానికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి ఇంటి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి ఎదుట ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ధర్నా చేశారు. ఆ సమయంలో బాలకృష్ణ ఇంట్లో లేకపోవడంతో వ్యక్తిగత కార్యదర్శి ద్వారా విషయం తెల్సుకున్న బాలకృష్ణ అంగన్వాడీల ఉద్యమానికి తన పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు సమాచారం పంపారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఇంటి ఎదుట గంటపాటు ధర్నా చేపట్టారు. మన్యం జిల్లా పాలకొండలో ఎమ్మెల్సీ విక్రాంత్ బాబు ఇల్లు ముట్టడిరచారు. వినుకొండలో ప్రదర్శన చేపట్టిన అంగన్వాడీలు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి ముట్టడికి యత్నించారు. అప్పటికే పెద్దఎత్తున పోలీసులు అక్కడకు చేరుకోవడంతో బారికేడ్లు అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైటాయించి ఎమ్మెల్యే బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రం ఇవ్వాలంటూ పోలీసులు సూచించగా అసోసియేషన్ ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో పోలీసులు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో చర్చలు జరిపి కొద్దిమందిని ఎమ్మెల్యే ఇంటికి వినతిపత్రం అందించేందుకు అనుమతించారు. నాయకులతో పాటు అంగన్వాడీ నాయకులు, సభ్యులు కలిసి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళుతుండగా అకస్మాత్తుగా ఎమ్మెల్యే అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఆయన అనుచరులు కొందరు పరుష పదజాలంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన వారిపై బ్రహ్మనాయుడు దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని అంగన్వాడీ నేతలు ప్రసన్నకుమారి, సారమ్మ మండిపడ్డారు. మహిళలకు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఇళ్లకు వెళ్లి తమ నిరసన తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించారు.