. సగ్గు బియ్యం మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు ఉపశమనం
. రూ.13,589.18 కోట్ల సబ్సిడీ భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి చార్జీల భారం లేకుండా కొత్త టారిఫ్ను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ టారిఫ్ను సోమవారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర జలవనరుల నిర్వహణ, రైతుశిక్షణ కేంద్రంలో నాగార్జున రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టప్రకారం టారిఫ్ రూపకల్పన జరిగిందని, ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అభ్యంతరాలు, సూచనలు కూడా స్వీకరించామన్నారు. ఇంధన ధరల అంచనాలకు, వాస్తవికతకు తేడా ఉంటుందని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్లు రూ.56,573.03 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.56,501.81 కోట్లకు కమిషన్ ఆమోదం తెలిపిందన్నారు. వార్షిక ఆదాయ అంతరం నిమిత్తం ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్ డిస్కమ్లు రూ.13,624.67 కోట్లు ప్రతిపాదించగా రూ.15,299.18 కోట్లకు కమిషన్ ఆమోదించిందన్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఈ మూడు డిస్కమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,589.18 కోట్ల మేర సబ్సిడీ అందించనుందన్నారు. రైల్వే ట్రాక్షన్ కు మినహా ఎవరిపైనా చార్జీల పెంపు లేదన్నారు. 2020-21 నుండి రైల్వే ట్రాక్షన్ కు టారిఫ్ లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు, ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన చార్జీలు యూనిట్ కు రూ.5.50 నుండి రూ.6.50కి పెంచడం జరిగిందన్నారు. అలాగే సగ్గు బియ్యం తయారీ మిల్లులకు, పౌల్ట్రీ ప్లాంట్లకు విద్యుత్ నియంత్రణ కమిషన్ కొంత మేర ఉపశమనం కలిగించిందని, సగ్గు బియ్యం మిల్లులను సీజనల్ పరిశ్రమల విభాగంలో చేర్చినట్లు వెల్లడిరచారు. పౌల్ట్రీ క్షేత్రాల కార్యకలాపాలకు అనుబంధంగా ఉన్న వారి కార్యాలయం, సిబ్బంది క్వార్టర్స్ వినియోగాన్ని పరిగణించడానికి మొత్తం వినియోగంలో 5 శాతం బిల్లింగ్ వరకు పౌల్ట్రీ కేటగిరి క్రిందనే అనుమతించబడతాయన్నారు. విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్లకు, డిస్కమ్లు అందించే విద్యుత్ రేటును విద్యుత్ సేవా ఖర్చు (కాస్ట్ ఆఫ్ సర్వీస్) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదన ఆమోదించలేదన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ కేటగిరీ కింద, ఫీడర్ వారీ వ్యవసాయ విక్రయాలను వారి వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలని డిస్కమ్లను కమిషన్ ఆదేశించిందన్నారు. వ్యవసాయ వినియోగదారులకు సబ్సిడీ చెల్లింపు ఆలస్యమయ్యే అంశాల్లో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను డిస్కమ్లు అనుసరించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవించాలని అభ్యర్థించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.వెంకట రామరెడ్డి, ఏపీజెన్కో ఎండీ కేవీఎన్. చక్రధర్ బాబు, సీపీడీసీఎల్ సీఎండీ కె.సంతోష్ రావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.