ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి మార్చుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తూ ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హితవుపలికారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉపాధ్యాయులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరిలో పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడలో చేపట్టిన ఉద్యమం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులపై కత్తిగట్టిందన్నారు. నాటి నుంచి రాత్రివేళల్లో తనిఖీల పేరుతో ఉపాధ్యాయులపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని తెలిపారు. రాత్రిపూట విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, నోట్ పుస్తకాలు తనిఖీ చేసి, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు, విద్యార్థుల ఇళ్ల నుంచే ఆయా ఉపాధ్యాయులకు ఫోన్ల ద్వారా బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు చేస్తుండడం దుర్మార్గం అన్నారు. స్థానిక విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులను ఏకంగా రాష్ట్ర సచివాలయానికి పిలిపించి మందలించాల్సిన అవసరమేమిటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి అధికారులను, ఉపాధ్యాయులను సచివాలయానికి రావాలని ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలివ్వడాన్ని రామకృష్ణ తప్పుపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సామర్థ్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. గతేడాది పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు నిర్వహించిన బేస్లైన్ టెస్ట్ ఫలితాలను కొద్ది రోజులు వెబ్సైట్లో ఉంచి, తదుపరి తొలగించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రభుత్వం ఫలితాలను దాచడం వెనుక మర్మమేంటి? గత సంవత్సరం నిర్వహించిన రెండు ఎఫ్ఎ, ఒక ఎస్ఎ పరీక్షల ఫలితాలను ఎందుకు వెల్లడిరచలేదు, తమ పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులను ఆయోమయానికి ప్రభుత్వం ఎందుకు గురిచేస్తోంది అని ఆ ప్రకటనలో రామకృష్ణ నిలదీశారు.
ప్రభుత్వరంగంలోని పాఠశాల విద్యావ్యవస్థ నిర్వీర్యమయ్యే దిశలో జగన్ ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోందని, 9 నెలల్లోనే 6.41 లక్షల మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. 4,234 ప్రాథమిక పాఠశాలను ఇతర పాఠశాలలో విలీనం చేశారన్నారు. 9 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని తెలిపారు. జగనన్న విద్యా కానుకలో పిల్లలకు ఇచ్చే బ్యాగులు, బూట్లు చాలా నాసిరకంగా ఉంటున్నాయని, విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా జరగడం లేదని, ఉపాధ్యాయలు, సిబ్బంది నియామకాలు లేవని విమర్శించారు. తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి మార్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మానుకుని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులు భర్తీచేయాలని, పాఠశాలలో వసతులు మెరుగుపరచాలని, ప్రభుత్వ విద్యావ్యవస్థలో పురోగతి సాధించేందుకు తగు చర్యలు చేపట్టాలని రామకృష్ణ హితవు పలికారు.