. పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే
. సరైన కారణాలను విచారణ కోర్టు చూపలేదని వ్యాఖ్య
న్యూదిల్లీ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు మీద కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాహుల్కు రెండేళ్ల గరిష్ఠ శిక్ష విధించడానికి సరైన కారణాలను విచారణ కోర్టు తన తీర్పులో వెల్లడిరచలేదని స్పష్టంచేసింది. సుప్రీంకోర్టును ధిక్కరించారని చెప్పడం తప్ప మరే ఇతర కారణాన్ని చూపలేదు కాబట్టి ఆయనకు శిక్ష అమలుపై స్టే విధిస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. భవిష్యత్లో జాగ్రత్తగా ఉండాలని రాహుల్కు సూచించింది. దోషిగా నిర్థారించే తీర్పును నిలిపివేసేలా ఉత్తర్వులు ఇచ్చింది. ‘ఈ పరిణామాలు రాహుల్ ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదుగానీ ఆయన వాడిన పదాలు సరైనవి కాదు. ప్రజా జీవితంలో ఉండి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర ఏ కారణాలు లేకపోవడంతో శిక్షపై స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. దీంతో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందేందుకు మార్గం సుగమమైంది. సుప్రీం తీర్పు ఆధారంగా తన ఎంపీ హోదాను రాహుల్ కోరవచ్చు లేక స్పీకర్ స్వయంగా దానిని పునరుద్ధరించవచ్చు.
విచారణ సమయంలో రాహుల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు వాదనలు వినిపించారు. గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ ఇంటిపేరు అసలు ‘మోదీ’ కాదని, ఆయన ఆ పేరును తర్వాత పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు.
రాహుల్ నేరస్థుడు కాదని, గతంలో బీజేపీ కార్యకర్తలు కేసులు పెట్టినా ఆయనకు ఎందులోనూ శిక్ష పడలేదన్నారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్, నిర్ధోషిగా విడుదలయ్యేందుకు రాహుల్కు ఇదే చివరి అవకాశమని కోర్టుకు సింఫ్వీు తెలిపారు. పూర్ణేశ్ మోదీ తరపున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. రెండు పక్షాలను విన్న సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ శిక్షపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఉంటుందన్నారు. ఈ మాటల ఆధారంగా పూర్ణేశ్ మోదీ కేసు పెట్టగా కాంగ్రెస్ అగ్రనేతకు రెండేళ్ల గరిష్ఠ శిక్షను గుజరాత్ కోర్టు విధించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యాయపోరాటం చేస్తా: పూర్ణేశ్ మోదీ
రాహుల్పై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను గౌరవిస్తున్నట్లు పూర్ణేశ్ మోదీ అన్నారు. సెషన్స్ కోర్టులో న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ‘మోదీ’ ఇంటిపేరు ఉన్న వారందరినీ, ముఖ్యంగా గుజరాత్లో ‘మోద్ వానిక్’ సామాజిక వర్గాన్ని రాహుల్ కించపరిచారని పూర్ణేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే.