Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎర్రదండు కదిలింది

. తిరుపతిలో సీపీఐ భారీ రోడ్‌ షో
. మురళిని గెలిపించాలని నేతల విజ్ఞప్తి

విశాలాంధ్ర-తిరుపతి : తిరుపతిలో ఎర్రదండు కదిలింది. వందలాది మంది ఎరుపు రంగు దుస్తులు ధరించి ముందుకు సాగుతుంటే… వీధులన్నీ అరుణార్ణవమయ్యాయి. ఈ ఎరుపును చూసిన తిరుపతివాసులు ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందా అని నివ్వెరపోయారు. కంకి, కొడవలి గుర్తు ఉన్న ఎర్రజెండాలు చేతబట్టి… గజ్జె కట్టి… డప్పు కొడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి సభ్యులు విప్లవ గీతాలు ఆలపిస్తుంటే…మనమూ వారితో కలుద్దామా అనే భావన ఏర్పడిరది. ఈ ఎరుపు మార్పునకు సంకేతంగా ప్రజలు అభివర్ణించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా భారత కమ్యూనిస్టు పార్టీ తరపున పి.మురళి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మురళి విజయాన్ని కాంక్షస్తూ సీపీఐ అధ్వర్యంలో తిరుపతి నగరంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన అన్నారావు కూడలి నుంచి ప్రారంభమైంది. టీటీడీ పరిపాలన భవనం, వీవీమహల్‌ రోడ్‌, పాత మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మీదుగా కొర్లగుంట కూడలి వరకు ఈ ప్రదర్శన నిర్వహించారు. తిరుపతి వాసులతో పాటు కమ్యూనిస్టు పార్టీ నేతలు వందలాది మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథరెడ్డి మాట్లాడుతూ… తిరుపతి నగరం వామపక్ష భావజాలం గల ఎంతో మంది నేతలను అందించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ వీధులు ఇలా ఎరుపెక్కి తిరుపతి రాజకీయాల్లో వణుకు పుట్టించాయన్నారు. శ్రమజీవులు ఏకమైతే ఎలా ఉంటుందో ఈ ప్రదర్శనే సాక్ష్యమన్నారు. ధనస్వామ్య రాజకీయాలు పెత్తనం చేసే వేళ… పేదలు ఏకమై కమ్యూనిస్టు పార్టీకి అండగా నిలవడం అభినందనీయమన్నారు. తిరుపతి సీపీఐ అభ్యర్థి మురళి ఎన్నో ఏళ్లుగా కార్మికవర్గ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ వారి మనసులు గెలుచుకున్నారన్నారు. మురళిని గెలిపిస్తే తిరుపతిలో పేదల తలరాతలు మారతాయన్నారు. ఇక పోలింగ్‌ తేదీ దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, జనసేన ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని హరినాథరెడ్డి ఆరోపించారు.
ఓటర్లు ఎవరూ ఈ ప్రలోభాలకు లొంగకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుపతి అభివృద్ధి, పేదల అభ్యున్నతి కోసం కంకి, కొడవలి గుర్తుపై ఓటు వేసి మురళిని గెలిపించాలని హరినాథరెడ్డి కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, ప్రభాకర్‌, శశి, నదియా, చలపతి, చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాంగటి గోపాల్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ప్రజానాట్యమండలి కళాకారులు గుర్రప్ప, నాగరాజు, కాలయ్య, సూరి, శేఖర్‌, బృందం ఆట పాట నగర ప్రజలను ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img