కేంద్ర బడ్జెట్లో మళ్లీ ‘కార్పొరేట్ కలర్’
కుర్చీ కాపాడుకునేందుకు భాగస్వామ్య పక్షాలకు నూకలు విసిరిన మోదీ
కేంద్రంలో అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇందుకు అద్దంపడుతోంది. ‘మిత్రలాభం…ప్రజాద్రోహం’ల సాంతం బడ్జెట్లో వర్ణనాతీతం. తనదైన శైలిలో ఇంకోసారి కార్పొరేట్ కలరిచ్చింది. తమ కుర్చీ కదలకుండా ఉండేందుకు అటు కార్పొరేట్లు, ఇటు కీలక భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపర్చడమే లక్ష్యంగా బడ్జెట్ కొనసాగింది. ఎన్డీఏ ప్రభుత్వం అస్థిరత బడ్జెట్లో స్పష్టంగా గోచరించింది. బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కీలక పక్షాల హామీలను నెరవేర్చకపోతే, సర్కారు పడిపోతుందని గట్టిగా నమ్ముతున్న మోదీ ఆ దిశగా బడ్జెట్ను రూపకల్పన చేసి, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై చిన్నచూపు ప్రదర్శించింది. యువతకు ఉపాధి కల్పించామని, నైపుణ్యత అందించామంటూ అబద్ధాలను వల్లెవేసింది. విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలపట్ల శీతకన్ను వేసింది. గడిచిన పదేళ్లలో నాలుగు రెట్లు లాభాలు ఆర్జించుకున్న కార్పొరేట్లకు మరిన్ని లాభాలిచ్చే ప్రక్రియకు ఈ కొత్త బడ్జెట్లో శ్రీకారం చుట్టింది. కార్పొరేట్లపై ఏ మాత్రం పన్నులు విధించకుండా జాగ్రత్తలు తీసుకున్న నిర్మల సామాన్యుల నెత్తిన నాట్యమాడుతున్న ధరాభారాన్ని తగ్గించడానికి మాత్రం వంద పేజీల బడ్జెట్లో ఒక్క పేజీని కూడా కేటాయించలేదు. పేదల పట్ల బీజేపీ దృక్కోణం బడ్జెట్లో విస్పష్టమైంది. విదేశీ పెట్టుబడులకు మరిన్ని దారులు కల్పిస్తూ ఎంఎస్ఎంఈలను వీలైనంత నీరుగార్చేందుకు సమాయత్తమైంది. ప్రజాప్రయోజనాలు కల్పించే ఏ రంగానికీ చెప్పుకోదగ్గ కేటాయింపులు చేయలేక చేతులు దులుపుకుంది. బీజేపీకి 8 మంది ఎంపీలనిచ్చిన తెలంగాణ ప్రజలను చావుదెబ్బతీసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, గాలి కేటాయింపులతో గారడీ చేసింది. అమరావతి, పోలవరం నిధులు చేతిదాకా వస్తే తప్ప మోదీ ప్రభుత్వాన్ని నమ్మలేమని ఏపీ ప్రజలకు తెలుసు. పదేళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ ఇన్నేళ్లూ రాల్చని కాసులను ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తాడంటే విశ్వసించగలమా?