. మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి ఘటన
. కావాలనే తగులబెట్టారని అనుమానాలు
. విచారణ చేసి తేలుస్తామన్న డీజీపీ
విశాలాంధ్ర`మదనపల్లె : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. భూములకు సంబంధించి సెక్షన్ 22ఎ విభాగం, కంప్యూటర్ సెక్షన్లో పూర్తిగా ఫైళ్లు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు వ్యాపించడంతో నైట్వాచ్మన్గా విధుల్లో ఉన్న నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన వీఆర్ఏ రమణ మంటలను గమనించి నిమ్మనపల్లె డిప్యూటీ తహసీల్దార్ తపస్వినికి సమాచారం అందించారు. వెనువెంటనే ఆమె మదనపల్లె ఆర్డీఓ సీసీ మణికి సమాచారం ఇవ్వడంతో ఆయన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఎగిసి పడుతున్న మంటలను ఆర్పివేశారు. అప్పటికే భవనంలోని చాలా రికార్డులు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద విషయాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయాన్నే కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీఐడీ, విజిలెన్స్ బృందాలు విచారణ మొదలు పెట్టాయి. కార్యాలయంలోని సీసీ కెమెరా ఫుటేజి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అయినప్పటికీ రాత్రి 10:30 గంటల వరకు విధుల్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ (కంప్యూటర్ ఆపరేటర్) గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏం జరిగిందనే దానిపై ప్రశ్నిస్తున్నారు. జిల్లాస్థాయి దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండగానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ అధిపతి రవిశంకర్ సాయంత్రానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సమగ్ర విచారణ చేపట్టారు. కాగా ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడున్న ఆర్డీఓను బదిలీ చేసి ఐఏఎస్ అధికారి మేఘ స్వరూప్ను మదనపల్లె సబ్కలెక్టర్గా నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. మేఘ స్వరూప్ సోమవారం బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి గురి కావడం అనుమానాలకు తావిస్తోంది.
అగ్ని ప్రమాదంపై అనుమానాలు: డీజీపీ
డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ అధిపతి రవిశంకర్, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ మూడు గంటల పాటు పరిశీలించిన తర్వాత అది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్గా భావిస్తున్నామన్నారు. 22ఏ భూముల రికార్డులున్న గదిలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కీలక దస్త్రాలున్న విభాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదు. ఘటన విషయం తెలుసుకున్న సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం కనిపిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలింది. ఇక్కడ వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పారు. ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పని చేస్తున్నారు? అగ్ని ప్రమాదం జరిగిన చోట అగ్గిపుల్లలు దొరకడం వంటి విషయాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని, దోషులు ఎంతటి వారైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు.
రన్నింగ్ ఫైల్స్ కాలిపోయాయి: కలెక్టర్
కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ… సబ్ కలెక్టర్ కార్యాలయంలో రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైనట్లు కలెక్టర్ తెలిపారు. మొత్తం 25 అంశాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయన్నారు. ఈ 25 అంశాల్లో చుక్కల భూములు, నిషేధిత భూములు ఉన్నట్లు తెలిపారు. కాలిపోయిన ఫైళ్లు ఏంటో గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఘటన ఎలా జరిగిందనేది తేలాల్సి ఉందని చెప్పారు.ఈ పరిశీలనలో జిల్లా ఏఎస్పీ రాజ్ కమల్, డీఆర్ఓ సత్యనారాయణరావు, మదనపల్లి ఆర్డిఓ హరిప్రసాద్, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.