Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

మోదీ పాలనలో ‘విద్య’ విధ్వంసం

. పాఠ్యాంశాల్లో ‘హిందూత్వ’ చొరబాటు
. చరిత్ర, రాజకీయ శాస్త్రాలను మార్చే కుట్ర
. పాఠశాల విద్య, అక్షరాస్యతకు ఖర్చు చేసింది ఏదీ?
. పాఠశాలల సంఖ్యను తగ్గించేస్తున్న వైనం
. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు నిలిపివేత

న్యూదిల్లీ : కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంస పాలన కొనసాగుతోంది. ఈ 10 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేసింది. విద్యను కాషాయీకరణ చేసేందుకు పాఠ్యాంశాల్లో ‘హిందూత్వ’ చొరబాటు పెరిగింది. చరిత్రను, రాజకీయ శాస్త్రాలను మార్చి వేసేందుకు కుట్ర పన్నింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు విద్యాభివృద్ధికి కృషి చేస్తామని, ఇందులో భాగంగా బాలికలపై ప్రత్యేక దృష్టితో ‘అవకాశాల సమానత్వం’ పై వాగ్దానం చేసింది. జీడీపీలో 6 శాతం మొత్తాన్ని విద్యకు ఖర్చు చేస్తామని, ఉపాధ్యాయులు, పరిశో ధకుల కొరతను తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని మోదీ సర్కార్‌ చెప్పుకొచ్చింది. అయితే మోదీ నేతృత్వంలోని ఒక దశాబ్దపు పాలనలో హిందుత్వ కథనానికి సరిపోయేలా పాఠ్య పుస్తకాల్లో, ముఖ్యంగా చరిత్ర, రాజకీయ శాస్త్రంలో మార్పు చేయడంలో అత్యంత చురుకైన చర్యలు కనిపించాయి. ఇది అట్టడగు వర్గాలు విద్యను పొందడంలో అంతరాయం కలిగించింది. జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020 ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల ఏకీకరణ ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది. ఇది విద్యా హక్కు చట్టం ముఖ్య దెబ్బతీస్తోందని ఫైనాన్షి యల్‌ అకౌంటబిలిటీ నెట్‌వర్క్‌ ఇండియా (ఫ్యాన్‌-ఇండియా) ద్వారా ‘ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ కార్డ్‌2014-24’ పేర్కొంది. ఇది పౌర సమాజ సంస్థలు, యూనియన్లు, ప్రజా ఉద్యమాలు, సంబంధిత పౌరుల సమష్టి సంస్థ. ‘2023లోనే దేశవ్యాప్తంగా 4 వేల పాఠశాలలను విలీనం చేశారు. ఇది అనేక మంది పిల్లలను ప్రభావితం చేసింది. మహారాష్ట్ర పాఠశాలల విలీనాన్ని ప్రకటించింది. ఇది దాదాపు 2 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూపగా, ఒడిశా 7,478 పాఠశాలలను మూసివేసింది. ఈ చర్యలు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో విద్యా ప్రవేశం, విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచేలా ఉందని ఆందోళన నెలకొందని పేర్కొంది. ‘విద్య పొందే’ అవకాశాలను మెరుగుపరుస్తామని మోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానానికి విరుద్ధంగా, ‘2018-19…. 2021-22 మధ్య దేశంలో మొత్తం పాఠశాలల సంఖ్య 15,51,000 నుంచి 14,89,115 కి పడిపోవడంతో 61,885 కు తగ్గిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ముఖ్యమైన క్షీణత కనిపించింది. 61,361 పాఠశాలలు మూతపడ్డాయి. ప్రయివేటు పాఠశాలల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇది అట్టడుగు వర్గాలకు విద్యను పొందడం పెద్ద ప్రశ్నగా మారుస్తుంది. 2014-15లో దేశవ్యాప్తంగా 11,07,118 ప్రభుత్వ పాఠశాలలు, 83,402 ప్రభుత్వ-ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల సంఖ్య 2021-22లో వరుసగా 10,22,386, అలాగే 82,480 కి తగ్గింది. మరోవైపు, 2014-15లో ప్రైవేట్‌ పాఠశాలల సంఖ్య 2,88,164 కాగా, 2021-22 నాటికి 3,35,844కి పెరిగి 47,680 పెరిగాయి.
ఉపాధ్యాయులు… పరిశోధకులు ఏరీ?
దేశంలో ఉపాధ్యాయులు, పరిశోధకుల కొరత తీవ్రంగా ఉందని పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ నివేదికను ఉటంకిస్తూ ‘ఫాన్‌`ఇండియా’ నివేదిక పేర్కొంది. 10 లక్షల మంజూరైన 62.71 లక్షల పోస్టులు రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలో నియామక లేఖల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలకు దరఖాస్తు చేసిన, అర్హత పొందిన అభ్యర్థుల వివిధ ఆందోళనల నివేదికల ద్వారా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిలలో క్షీణతను కనుగొంది. జీఈఆర్‌ ప్రాథమిక స్థాయిలో 103.39 తగ్గి ఉన్నత స్థాయిలో 57.56కు చేరుకుంది. అత్యంత నష్టపోయిన అట్టడుగు వర్గాల విషయానికొస్తే… షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్‌సీలు), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌టీలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), మైనార్టీలు. 2022లో, 2022-23 విద్యా సంవత్సరానికి ఎస్టీలు, ఎస్సీటలు, ఓబీసీలు, మతపరమైన మైనారిటీలకు 1-8 తరగతులకు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు నిలిచిపోయాయని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img