కడప జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలో ఘటన
మృతదేహంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన
పాఠశాల గుర్తింపు రద్దు : డీఈఓ
విశాలాంధ్ర – కడప బ్యూరో : కడప జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థలో పులివెందులకు చెందిన సుహిత్ (11) ఆరవ తరగతి చదువుతున్నాడు. సుహిత్ శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలోని ఫర్నీచర్ను పగలగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పులివెందులకు చెందిన నాగరాజు, లలితల కుమారుడు సూహిత్ తెల్లవారు జామున కడుపునొప్పిగా ఉందని హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పులివెందులలో ఉన్న తల్లిదండ్రులు చెన్నూరులో ఉన్న తమ బంధువులకు సమాచారం అందించారు. వారు స్కూల్కు వెళ్లి సుహిత్ను పరామర్శించారు. అప్పటికే స్పృహకోల్పోయిన సుహిత్ను చికిత్స నిమిత్తం మోటారు సైకిల్పై 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థి చికిత్స పొందుతున్న కొద్దిసేపటికే మృతి చెందాడు. సుహిత్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడి ఒంటి పైన, వేలుకు, కడుపు, బొడ్డుపై గాయాలు ఉన్నాయని, ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆరోపించారు. విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకుల అధ్వర్యంలో పాఠశాల వద్ద సుహిత్ మృతదేహాంతో ఆందోళనకు దిగారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, కడప, మైదుకూరు, ఖాజీపేటకు చెందిన ఎస్ఐలు, సీఐలు, ప్రత్యేక పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసుకొంటూ విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాయకష్టం చేసి పిల్లలు బాగుండాలని లక్షలాది రూపాయలు చెల్లిస్తే చివరికి విద్యార్థుల ప్రాణాలు ఇంటికి రావడం ఘోరమన్నారు. ఒకే క్యాంపస్లో అన్ని రకాల కోర్సులు నడుస్తూ ఉంటే అధికారులు నిమ్మకునీరెత్తి వ్యవహరించడం ఇందుకు నిదర్శనమన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలనూ సందర్శించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విద్యార్థి సుహిత్ మృతికి కారణమైన బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలంటూ ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించక పోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ భవనం అద్దాలను, ఫర్నీచర్ను, గేటు తాళాలను పగలగొట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య సుహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఐదుగురితో విచారణ కమిటీ: ఈడీఓ
విద్యార్థి అనుమానాస్పద మృతికి కారణమైన బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ గుర్తింపును రద్దు చేస్తున్నట్టు డీఈఓ రాఘవరెడ్డి తెలిపారు. గుర్తింపు రద్దు శనివారం నుంచే అమలులోకి వస్తుందన్నారు. విద్యార్థి మృతి ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమిస్తున్నట్టు చెప్పారు.
స్కూల్ యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలి : విద్యార్థి సంఘాలు
బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో యాజమాన్యం పర్యవేక్షణ లోపం వలన ఉపాధ్యాయుడి దాడిలో విద్యార్థి మృతి చెందాడని, ఇది ముమ్మాటికీ స్కూల్ యాజమాన్య హత్యేనని తక్షణం వారిపై హత్య కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.వలరాజు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్ర, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు బాబు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తిరుమలేష్, ఆర్వీఎస్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్, ఆర్ఎస్యూ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. శనివారం విద్యార్థి, యువజన సంఘాలు కలిసి బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ వద్ద చనిపోయిన విద్యార్థి మృతదేహంతో ధర్నా చేశారు. భారీగా మోహరించిన పోలీసులు ధర్నా చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి స్కూల్లో సుహిత్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందాడని, దీనిలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రధాన కారణం అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటూ కూడా సరైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకపోవటం వలన ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శించారు.
విద్యాశాఖ అధికారులు కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు అమ్ముడుపోయి ఎన్ని ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.