. అమలుకు నోటిఫికేషన్ జారీ
. లోక్సభ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికి యత్నం
. బెంగాల్, అసోం లక్ష్యంగా మోదీ సర్కార్ వినాశకర చర్య
న్యూదిల్లీ : కేంద్రంలోని కాషాయ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, లౌకిక విలువలకు తూట్లు పొడిచే వినాశకర చర్యకు పూనుకుంది. మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్న మోదీ సర్కార్ మరో ముందడుగు వేసి లోక్సభ ఎన్నికలకు ముందు పౌరసత్వ (సవరణ) చట్టం`2019ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసి, ఉద్యమించినప్పటికీ, నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కుట్రను అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన పత్రాలు లేని ముస్లింయేతర వలసదారులకు పౌరసత్వానికి మార్గం సుగమం చేస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడే కొద్ది రోజుల ముందే నిబంధనలను నోటిఫై చేశారు. దీంతో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మూడు దేశాల నుంచి ముస్లింయేతర వలసదారులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడం ప్రారంభిస్తుంది. ‘పౌరసత్వ (సవరణ) నిబంధనలు2024 అని పిలిచే ఈ నియమాలు సీఏఏ
2019 కింద అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి’ అని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తులను పూర్తిగా ఆన్ లైన్ పద్ధతిలో సమర్పించాల్సి ఉంటుందని, ఇందుకోసం వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 2019 డిసెంబరులో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. అయితే దీనికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనలు జరిగాయి. అనేక ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టాన్ని ‘వివక్షత’తో కూడినదని పేర్కొన్నాయి. అయితే ఇప్పటి వరకు నిబంధనలు నోటిఫై చేయకపోవడంతో చట్టం అమలులోకి రాలేదు. పార్లమెంటరీ పనిపై మాన్యువల్ ప్రకారం, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలలలోపు ఏదైనా చట్టానికి సంబంధించిన నియమాలు రూపొందించాలి లేదా ప్రభుత్వం లోక్సభ, రాజ్యసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీల నుంచి పొడిగింపును కోరాల్సి ఉంటుంది. అయితే 2020 నుంచి హోం మంత్రిత్వ శాఖ నిబంధనలను రూపొందించడానికి పార్లమెంటరీ కమిటీ నుంచి క్రమ వ్యవధిలో పొడిగింపులను తీసుకుంటోంది. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి పత్రాలు కోరడం లేదని ఒక అధికారి తెలిపారు.
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, పోలీసుల చర్యల సమయంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సీఏఏ నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో గతంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరిగిన దిల్లీలోని అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈశాన్య దిల్లీలోని షాహీన్బాగ్, జామియా, ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు. ఇదిలాఉండగా, డిసెంబరు 27, 2023న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోల్కతాలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, సీఏఏను అమలు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని షా అన్నారు. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మొదటి నుంచి సీఏఏను వ్యతిరేకిస్తోంది. వివాదాస్పద సీఏఏని అమలు చేస్తామన్న వాగ్దానం పశ్చిమ బెంగాల్లో గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ప్రధాన ఎన్నికల ప్రణాళిక. బెంగాల్లో బీజేపీ పుంజుకోవడానికి దారితీసిన అంశమని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాగా, గత రెండు సంవత్సరాలలో పౌరసత్వ చట్టం1955 ప్రకారం ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు పౌరసత్వం మంజూరు చేయడానికి తొమ్మిది రాష్ట్రాల్లోని 30 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, హోం శాఖ కార్యదర్శులకు అధికారాలు కల్పించారు. 2021-22 సంవత్సరానికిగాను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వార్షిక నివేదిక ప్రకారం, ఏప్రిల్ 1, 2021 నుంచి డిసెంబరు 31, 2021 వరకు ఈ మూడు దేశాల నుంచి ఈ ముస్లింయేతర మైనారిటీ వర్గాలకు చెందిన మొత్తం 1,414 మంది విదేశీయులకు పౌరసత్వ చట్టం
1955 కింద నమోదు లేదా సహజంగా భారత పౌరసత్వం ఇచ్చారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ల నుంచి వచ్చిన ముస్లింయేతర మైనారిటీలకు పౌరసత్వ చట్టం`1955 కింద భారతీయ పౌరసత్వం రిజిస్ట్రేషన్ లేదా సహజంగా ఇవ్వబడిన తొమ్మిది రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, చత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ మహారాష్ట్ర. రాజకీయంగా చాలా సున్నితమైన సమస్య ఉన్న అసోం, పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లాల అధికారులకు ఇప్పటివరకు అధికారాలు ఇవ్వలేదు.