. చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
. బీజేపీ, జనసేన నుంచి షెకావత్, పండా, పవన్, మనోహర్ హాజరు
. పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై చర్చించిన నేతలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పుడు సీట్ల సర్దుబాటుపై కసరత్తు వేగవంతం చేశాయి. ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు… బీజేపీ, జనసేన పార్టీలకు ఎనిమిది ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వాటిలో ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ పోటీ చేయాలని, రెండు సీట్లకు జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. అలాగే జనసేన 24 అసెంబ్లీ, బీజేపీ ఆరు అసెంబ్లీ సీట్లకు పోటీ చేయనున్నాయి. బీజేపీ పోటీ చేసే ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖరారుపై కసరత్తు నిర్వహించేందుకు ఆదివారం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నాయకులు బైజయంత్ పండా విజయవాడ విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలతో సమావేశమై ఆశావాహుల్లో సమర్థనేతలు ఎవరెవరున్నారు… వారు ఏఏ నియోజకవర్గాలను ఆశిస్తున్నారు… ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు తదితర అంశాలపై ముఖ్యనేతలతో చర్చించారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లతో కూడా వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జనసేన పోటీచేసే స్థానాలపై కూడా చర్చించారు. బీజేపీ ఆశించే స్థానాలు, వాటికి పోటీపడే అభ్యర్థులపై కొంత స్పష్టత వచ్చిన తర్వాత సోమవారం ఉదయం చంద్రబాబుతో ఉండవల్లిలోని ఆయన నివాసంలో షెకావత్, పండా భేటీ అయ్యారు. తొలుత వారికి చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. దుశ్శాలువా, మెమెంటోలతో సత్కరించారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ భేటీలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై దాదాపు ఎనిమిది గంటల పాటు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. టీడీపీ ఇప్పటికే 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు, జనసేన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపీ అభ్యర్థులను మాత్రం ఇప్పటివరకు ఒక్కరినీ కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేనలకు కేటాయించిన ఎనిమిది ఎంపీ సీట్లకు, 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులను ఖరారు చేస్తే, మిగిలిన 17 ఎంపీ స్థానాలకు, 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ భేటీలో చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది.
బీజేపీ, జనసేన పోటీచేసే స్థానాలివే…
బీజేపీ, జనసేన పోటీ చేసే ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల విషయమై కూటమి ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, రాజమండ్రి నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, హిందూపురం నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీతలకు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే జనసేన తరపున పోటీచేసే స్థానాల్లో కాకినాడ నుంచి ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని, రెండు, మూడు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.