. అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు తీసుకెళ్లొద్దు
. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రతను చూసే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆ లోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్న నేపథ్యంలో జీఏడీ తాజాగా ఈ ఉత్వర్వులు జారీ చేసింది.