కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కడప ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని, వీళ్ళ రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోదీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. మోడీ చేతిలో సిబిఐ ఉందని ఈడీ ఉంది అని, అందుకే వీళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతం.. బీజేపీ కి వ్యతిరేకం అని రాహుల్ అన్నారు. జగన్ మాత్రం బీజేపీ కి మద్దతుగా ఉన్నారని, బీజేపీ నీ జగన్ ఒక్క మాట అనబోరని, అవినీతి బయటపడుతుంది అని భయం అని చెప్పారు. ఇదే భయం చంద్రబాబుకి ఉందని అన్నారు. ఎపి హక్కులు డిల్లీలో వినపడాలి అంటే..కాంగ్రెస్ రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఎపి విభజన అయ్యాక బీజేపీ ఎన్నో హామీలు చేసిందని, ఇచ్చిన వాగ్దానాలను ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చిందా ? పోలవరం కట్టారా ? కడప స్టీల్ కట్టారా ? అని ప్రశ్నించారు. బిజెపి ముందు ఏపి ఆత్మ గౌరవం తలదించుకొని ఉందన్నారు. ఏపిలో అవినీతి సర్కార్ నడుస్తుందని అన్నారు. 2014 లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చి ఉంటే అన్ని హామీలు నెరవేరేవని అన్నారు. 2024 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం అన్నారు. పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము కొన్ని వాగ్ధానాలు ఇచ్చామని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కెజి టు పిజి ఉచిత విద్య అమలు చేస్తామన్నారు. నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. 2.25లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. చరిత్రలో ఎవరూ చేయని ఆలోచనలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు. ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను ఎంపిక చేస్తామని, ఆ మహిళకు బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు ఏడాదికి ఇస్తామని అన్నారు. ప్రతి నెల 8500 రూపాయలు ఇస్తామన్నారు. కోట్లాది మంది జీవిత శైలి మారుతుందని, తాము కోట్లాదిమందిని లక్షాది కారులుగా చేస్తామని రాహుల్ హామీల వర్షం కురిపించారు. ఈ దేశ ప్రజలను మోడీ సోమరి పోతులను చేస్తున్నారన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని రాహుల్ అన్నారు. ప్రతి ఏడాది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 400 కి పెంచుతామన్నారు. రాజ్యాంగాన్ని రక్షించే పనిలో ఉన్నామని, ఈ రాజ్యాంగం పరిరక్షిస్తే మనకు హౌదా వస్తుందని చెప్పారు. ఈ రాజ్యాంగం ద్వారానే పోలవరం ప్రాజెక్టు వస్తుందని అన్నారు. మోడీ ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, మోదీ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. భారతీయుల భవిష్యత్ మన రాజ్యాంగం మీద ఆధారపడి ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు లభించిన హక్కులు ఈ దేశ రాజ్యాంగం తోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ , వైఎస్ఆర్ ఒక్కటేనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే ఉన్నారని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఆలోచనలకి వ్యతిరేకంగా ఉండదు అని రాహుల్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తమవారనీ, ఆయన బిడ్డ తన చెల్లెలు ఇవ్వాళ మీ ముందు నిలబడింది అని, తన చెల్లి పార్లమెంట్ లో ఉండాలి అని రాహుల్ కోరారు. వైఎస్ఆర్ సైద్ధాంతిక విలువలు షర్మిల లో ఉన్నాయన్నారు. తన చెల్లెలి తరుపున ఏపి ప్రజల వాగ్ధానం అడుగుతున్నానని.. వైఎస్ షర్మిలను పార్లమెంట్ కు పంపాలని, ఏపి ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినపడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.