. రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ధర్నాలు
. జగన్ పాలనలో విద్యావ్యవస్థ తిరోగమనం: ఈశ్వరయ్య
. స్పందించకుంటే ప్రభుత్వానికి ఘోరీకడతాం: జాన్సన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జిల్లా కలెక్టరేట్ల ముట్టడి విజయవంతమైంది. ఈ ఆందోళనా కార్యక్రమాల్లో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని, ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసించారు. పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, వసతి గృహాలకు కూడా నాడు`నేడు అమలు చేయాలని విద్యార్థులు నినదించారు. ఒంగోలు జిల్లా ప్రకాశం భవన్ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్య దర్శివర్గసభ్యులు, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ పూర్తి తిరోగ మనంలో ఉందని, గజ్జి, తామర పసికర్లు వంటి రోగాలు హాస్టల్ విద్యార్థుల ఇంటిపేరుగా మారా యని విమర్శించారు. గతంలో నెలకి రెండుసార్లు డాక్టర్లు, నర్సులు వచ్చి మందులు అందించేవారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోగా హాస్టళ్లలో స్వీపర్స్ కొరత తీవ్రంగా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పాతాళంలోనే ఉన్నాయన్నారు. హాస్టళ్లకి సన్నబియ్యం సరఫరా చేయాలని, విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లకి నాడు-నేడు పథకాన్ని వర్తింపజేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 37 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎప్ జిల్లా అధ్యక్షులు పి.నాగేంద్రబాబు, కార్యదర్శి లక్ష్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిర్వహించిన ధర్నాకు హాజరైన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్బాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా అనేక వాగ్దానాలు చేసిన జగన్…అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే విద్యార్థుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, ప్రభుత్వానికి ఘోరీ కడతామని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రారంభించాలని, కేజీబీవీ పాఠశాలల్లో సీట్ల సంఖ్య పెంచాలని, ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, అనంతపురం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ హనుమంతు ,రమణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్ నాయక్, ఆంజనేయులు, నరసింహ యాదవ్, ఉమా మహేశ్, వేణు, వినోద్, వంశీ, రాజేశ్, చిరంజీవి, ఆనంద్, జగదీశ్, చందు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా కార్యదర్శి బండి చలపతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుని కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిరది. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్, థామస్, సహాయ కార్యదర్శులు విజేంద్ర, షాబీర్, భాషా, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.