. అభ్యర్థుల ఆందోళన
. కంప్యూటర్ కోర్సుపైఆసక్తి
. ఇతర రాష్ట్రాల వైపు చూపు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్) 2023 వెబ్ కౌన్సెలింగ్ జాప్యంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ అభ్యర్థులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని ఫలితాల వెల్లడి సమయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తేదీ దాటిపోయినా ఇంతవరకు వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియపై ఎలాంటి కదలిక కనిపించడం లేదు. జాతీయస్థాయిలో జరిగే ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ ప్రవేశాలు పూర్తయ్యాకే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, తెలంగాణలో కౌన్సెలింగ్కూ తమకు సంబంధం లేదని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఈఏపీసెట్ వెబ్సైట్లోనూ శుక్రవారం సాయంత్రం వరకు కౌన్సెలింగ్పై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ సీట్లలో కంప్యూటర్, అనుబంధిత బ్రాంచ్లకు డిమాండ్ ఉండటంతో, వాటికే అభ్యర్థులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ నుంచి డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సైతం కంప్యూటర్ బ్రాంచినే అభ్యర్థులు ఎంచుకోవడంతో ఈ దుస్థితి ఎదురైంది. దీనిని గమనించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం భారీగా ఫీజుల దోపిడీ చేస్తోంది. ఏపీ ఈఏపీసెట్లో కౌన్సెలింగ్లో అత్యధికంగా ఇంజినీరింగ్ సీట్లే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు 252 ఉండగా… మొత్తం లక్షా 49వేల సీట్లు ఈ విద్యాసంవత్సరం కౌన్సెలింగ్కు అనుమతి లభించింది. ఎక్కువ మంది అభ్యర్థులు ఇంజినీరింగ్ సీట్ల కోసమే ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విద్యార్థులు ఏపీతోపాటు కర్నాటక, చెన్నై, హైదరాబాద్, ఒడిశా, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు పొందుతున్నారు. వారిలో అధిక శాతం కంప్యూటర్ ఇంజినీరింగ్ (సీఎస్సీ), అనుబంధ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఎక్కడ సీటు రాని వాళ్లంతా ఏపీ సెట్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారూ కంప్యూటర్ సీట్ల వైపే మొగ్గుచూపుతున్నారు.
యాజమాన్య సీట్లకు గిరాకీ
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం కారణంగా విద్యార్థులు తొలుత యాజమాన్య సీట్లలో కంప్యూటర్, అనుబంధ కోర్సులు రిజర్వు చేసుకుంటున్నారు. అందుకోసం రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఏపీలో పేరొందిన నాలుగైదు ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే కంప్యూటర్, అనుబంధ కోర్సుల సీట్లు భర్తీ అయినట్లు సమాచారం. ఇంజినీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థుల తరగతుల నిర్వహణకు ప్రైవేట్ యాజమాన్యం సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ప్రైవేట్/డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందే స్థోమతలేని విద్యార్థులంతా కౌన్సెలింగ్పైనే ఆధారపడి ఉన్నారు. ఈ కౌన్సెలింగ్లో తమ ర్యాంక్కు కంప్యూటర్ సీటు వస్తుందా? లేదా? అనే ఆందోళనతో యాజమాన్య కోటా సీట్లను రిజర్వు చేసుకుంటున్నారు. కన్వీనర్ కోటాలో సీటు వస్తే ముందుగా చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేలా యాజమాన్యంతో మాట్లాడుకుంటున్నారు. కొంతమేరకు ఆర్థిక స్థోమత గల విద్యార్థులంతా యాజమాన్య సీట్లపైనే దృష్టి సారించారు. దీనంతటికీ కౌన్సెలింగ్ జాప్యమేనని అభ్యర్థులు వాపోతున్నారు. తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు బయట వడ్డీలకు తెచ్చి…ఇంజనీరింగ్ సీట్ల కోసం అవస్థలు పడుతున్నారు.
ముందస్తు ప్రణాళిక కరువు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై ఉన్నత విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభమవ్వగా, ఏపీలో ఆ ముచ్చటే కనిపించడం లేదు. తెలంగాణతో తమకు సంబంధం లేదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాలు పూర్తవ్వడానికి నెలకుపైగా పడుతుంది. ఈలోగా ఏపీలో డిగ్రీలో ప్రవేశాలకు ప్రకటన జారీజేశారు. వాటికి కూడా వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వడానికి మరో నెల పడుతుంది. దీని ఆధారంగా ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూలు ఈ నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో వచ్చే అవకాశాలున్నాయి.
ఏపీ ఈఏపీసెట్ను తెలంగాణకు చెందిన 20వేల మంది విద్యార్థులు రాశారు. వారిలో చాలామంది ఇక్కడ పేరొందిన ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్లు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏపీలో కౌన్సెలింగ్ ప్రారంభించనందున తెలంగాణ కళాశాలల్లో చేరుతున్నారు.
యేటా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జాప్యంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కౌన్సెలింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.