భారం మోస్తూనేవున్న వినియోగదారుడు
న్యూదిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా ప్రజలపై భారాలను మోపుతూనేవుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన వెనువెంటనే మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్నది. ఇప్పుడు ముడి చమురు ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని సామాన్యుడికి దక్కనీయడం లేదు. అంతర్జాతీయ ధరలను అనుసరించి చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ఇంధన ధరలను సవరిస్తాయనీ, 2022 జూన్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పురి తాజాగా పార్లమెంట్లో చెప్పారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 2022 జూన్ నుంచి ముడి చమురు ధరలు మూడో వంతు తగ్గాయి. అయినా దేశీయంగా పెట్రో ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. దీనిపై కేంద్ర మంత్రి నోరు మెదపలేదు. అంతర్జాతీయ మార్కెట్లో 2013లో బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉండగా దేశీయంగా లీటరు పెట్రోల్ ధర 76 రూపాయలు ఉన్నది. 2023లో బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లు ఉండగా, లీటరు పెట్రోల్ ధర 109 రూపాయలున్నాయి. అంతర్జా తీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రో ధరలు తగ్గుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించకపోగా పెంచుకుంటూ పోయింది. 2015-17 మధ్య ముడి చమురు ధరలు 45-47 డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్పై 22.9 శాతం, డీజిల్పై ఏకంగా 68.47 శాతం పెంచింది. 2020లో ముడి చముధరలు 20 డాలర్లకు పడిపోయాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే కేంద్రం ఆ మేరకు ధరలు తగ్గించకపోగా భారీగా పెంచుకుంటూ పోయింది. 2020 మార్చి 30న పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రూ.19.98గా ఉండగా, 2021 ఫిబ్రవరి నాటికి రూ.32.90కి పెంచింది. డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచింది.