ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైఎస్ వివేకా కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారని, వైసీపీని గెలిపించారని చెప్పారు. కష్టపడి పని చేసి పార్టీని గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయడ్డారని అన్నారు. తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని ఆందోళన చెందారని చెప్పారు. వివేకాను ఎవరు చంపారనే విషయం కడపలో ప్రతి ఒక్కరికీ తెలుసని జగన్ అన్నారని సునీత గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జగన్ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. జగన్ ఎందుకు భయపడుతున్నారనే విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. దీనిపై డిబేట్ జరిగితే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. తనతో నేరుగా మాట్లాడాలంటే సాక్షి ఛానల్ కే వస్తానని, అన్ని విషయాలు మాట్లాడదామని అన్నారు. సాక్షి ఛానల్ కి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారని తనకు తెలిసిందని… ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని సునీత చెప్పారు. షర్మిలను కలిసి సంఘీభావం తెలుపుదామన్నా కుదరని పరిస్థితి ఉందని… తెలంగాణ హైకోర్టుకు రావాల్సి వచ్చిందని అన్నారు.