. 77 రోజులైనా చర్యలు తీసుకోకపోవడంపై ప్రజాగ్రహం
. మీరు చర్యలు తీసుకుంటారా…మేము తీసుకోమా: సుప్రీం
ఇంఫాల్ : మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కలకలం సృష్టిం చింది. ఓ అల్లరి మూక ఇద్దరు గిరిజన మహిళలను ఎత్తుకెళ్లి, నగ్నంగా ఊరేగించి, వారిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటనకు సంబంధించిన 26 సెకన్ల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగి 77 రోజులు అయినాగానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని జోక్యం చేసుకోమం టారా అని కేంద్రంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దీంతో చర్యలకు పూనుకున్న కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను ఉపేక్షించేది లేదని ప్రకటించాయి. వీడియో ఆధారంగా నాంగ్పోక్ సెక్మై పోలీసు స్టేషన్లో గుర్తుతెలియని సాయుధులపై అపహరణ, సామూహిక అత్యాచారం, హత్యారోపణలతో కేసు నమోదైంది. మణిపూర్ పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడిని అరెస్టు చేయగా అతనిని 32ఏళ్ల హీరాదాస్గా గుర్తించారు. అప్పట్లో పరిస్థితులు తీవ్రంగా క్షీణించడం, సంక్షోభ నివారణ, సహాయక చర్యలపైనే దృష్టి పెట్టడంతో చర్యలు ఆలస్యమైనట్లు ప్రభుత్వ వర్గాలు సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. ప్రసుత్తం అనేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి ముఖ గుర్తింపు సాంకేతికత ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడిరచాయి. దోషులకు మరణ శిక్ష విధించే అంశం పరిశీలనలో ఉన్నట్లు ఈశాన్య రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. పార్లమెంటులోనూ మణిపూర్ అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. అసమర్థ ముఖ్యమంత్రి రాజీనామాకు కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శలు, ధర్నాలను రాజకీయ, ప్రజా సంఘాలు చేపట్టాయి. ఈ అమానవీయ, అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గిరిజన సంఘాలు వేర్వేరు ప్రకటనలు చేశాయి. ‘మణిపూర్లో ఆడబిడ్డలకు జరిగినది ఒకవైపు బాధిస్తోంది. మరోవైపు కోసం తెప్పిస్తోంది. ఇది ఎప్పటికీ మరువలేం. 140కోట్ల మందికి సిగ్గుచేటు’ అని ప్రధాని మోదీ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. మణిపూర్లో మానవత్వం చచ్చిపోయిందని, ఇది ప్రజాస్వామ్యం కాదు మూకస్వామ్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ఇంతటి క్రూరమైన నాయకుడు మరెవ్వరూ ఉండరని, మణిపూర్ తగలబడిపోతుంటే మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని, తాజా ఘటన హేయమైనదని, కలచివేసిందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. ఇంతటి ఘోరమైన వీడియో తనను షాక్కు గురిచేసినట్లు మిజోరం ముఖ్యమంత్రి జోరంధంగా అన్నారు. కేవలం కేంద్రమే మణిపూర్ సమస్యను పరిష్కరించగలదని, ఈ పెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని చెప్పారు. మే 3వ తేదీ నుంచి మణిపూర్లో హింస జరుగుతూనే ఉంది.