తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ షాక్.. పదవి నుంచి తొలగింపు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పాలకమండలి వేటువేసింది. టీటీడీ నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు సోమవారం టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం, అర్చకులు, జీయ్యర్లపై రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారని చైర్మన్ చెప్పారు. రమణ దీక్షితులు వ్యాఖ్యలపై సోమవారం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు. టీటీడీపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల తీవ్రతపై చర్చించిన సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. పాలకమండలి నిర్ణయం మేరకు దీక్షితులను టీటీడీ నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.