. పార్లమెంటును జరగనివ్వకపోవడం అప్రజాస్వామికం
. డబుల్ ఇంజిన్ మణిపూర్లో చేసినదేమిటి?
. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా
చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పార్లమెంటును స్తంభింపజేయడం అప్రజాస్వామ్యమన్నారు. మణిపూర్లో యుద్ధ తరహా పరిస్థితులు నెలకొంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అక్కడ ఏం చేసిందని ప్రశ్నించారు. ఆయన మంగళవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్లో హింసపై పార్లమెంటును ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం స్తంభింపజేస్తోందని దుయ్యబట్టారు. మణిపూర్పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని, విపక్షాల డిమాండ్ను అంగీకరించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అదానీ వ్యవహారం తరహాలో ఇప్పుడు జరుగుతోందని రాజా అన్నారు. ‘బీజేపీ ప్రభుత్వం ఎందుకని పార్లమెంటును జరగనివ్వడంలేదు? ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ. ప్రజల సార్వభౌమ సంకల్పానికి పార్లమెంటు ప్రాతినిధ్యం వహిస్తుందని బీఆర్ అంబేద్కర్ స్వయంగా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పార్లమెంటు స్తంభించింది. ఇందుకు కారణం అదానీ వ్యవహారంపై చర్చను ప్రభుత్వం వద్దని భావించడమే. ఇప్పుడు ఇండియా కూటమి మణిపూర్లో జరిగిన ఘటనలపై ప్రధాని నుంచి వివరణను కోరుతోంది. అలాగే ఆ రాష్ట్రంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తోంది. కానీ ప్రధాని మౌనం వీడటం లేదు. మోదీ ఎప్పుడు పార్లమెంటును ప్రజాస్వామ్యానికి ఆలయంగా వర్ణిస్తుంటారు. జీ20 సమావేశంలో భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని చెప్పారు. కానీ ప్రతిపక్షాల డిమాండ్ను అంగీకరించకుండా బీష్మించారు. పార్లమెంటును స్తంభింపజేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. పార్లమెంటు నిర్వీర్యమైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మణిపూర్ సంక్షోభంపై చర్చ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్లో ప్రస్తుత పరిస్థితి యుద్ధాన్ని తలపిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, దేశంలో పురోగతి గురించి ప్రధాని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ మణిపూర్లో ఈ డబుల్ ఇంజిన్ ఏం చేసింది? విభజన రాజకీయాలను కేంద్రం అనుసరిస్తోంది’ అని రాజా అన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో హింస ఆగేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్లో హింస, ప్రధాని ప్రకటన, సమయ నియమం లేకుండా మాట్లాడేందుకు అనుమతి కోసం ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంగీకరించడంలేదు. దీంతో ఉభయ సభలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
కింద పడిపోయిన రాజా
విలేకరులతో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి వెళ్లే క్రమంలో రాజా తూలి కింద పడిపోయారు. ఆయనను సహచరులు వెంటనే పైకి లేపి కారు వద్దకు తీసుకెళ్లారు. ఆపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. రాజా ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు.