ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్
వాలంటీర్ ఉద్యోగాల గురించి, ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆరోపించారు. కేవలం ఐదు వేల రూపాయలకు యువశక్తిని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. పెద్దపెద్ద చదువులు చదివిన యువతను ఇంత తక్కువ జీతానికే సీఎం జగన్ గ్రామాలలో కట్టిపడేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో 33 వేల గ్రామాలు ఉన్నాయని, గ్రామానికి పది మంది చొప్పున లెక్కేసుకున్నా వాలంటీర్ల పేరుతో వీరందరిని కట్టేస్తున్నారని జనసేనాని మండిపడ్డారు. వీరిలో ఎంతోమంది సైంటిస్టులు, వ్యాపారవేత్తలు, ఇంజినీర్లుగా మారే అవకాశం ఉందని, వారిలో దాగున్న ప్రతిభను గుర్తించకుండా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. యువతలో ఉన్న సామర్ధ్యాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించడం లేదని , డిగ్రీలు, పీజీలు చదవిన యువతను వాలంటీర్ల పేరుతో ఐదువేలు ఇస్తూ ఊడిగం చేయించుకుంటున్నారని పవన్ విమర్శించారు.డిగ్రీ చదువుకున్న వాళ్లను ఐదువేలకు పనిచేయమంటే అది ఉద్యోగమా.. లేదా ఊడిగమా అంటూ జనసేనాని ప్రశ్నించారు. మరోవైపు బుధవారం పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.