. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
. సమ్మె విచ్ఛిన్న ప్రయత్నాలు మానుకోవాలి: ఓబులేసు
. సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన ఆగదు: ఆసుల, పోరుమామిళ్ల
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మున్సిపల్ వర్కర్ల ఉద్యమం రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం, న్యాయమైన డిమాండ్లపై ఆందోళనకు దిగిన మున్సిపల్ వర్కర్ల సమస్యల పరిష్కారంలో మంత్రుల బృందం మొక్కుబడి చర్చలతో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండడంతో ఆగ్రహించిన కార్మికలోకం సోమవారం ఆందో ళనను మరింత ఉధృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట కార్మికులు పెద్దసంఖ్యలో గుమిగూడి వినూత్న తరహాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏఐటీయూసీ అధ్వర్యాన గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ఓబులేసు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు శాంతి యుతంగా చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయ త్నాలను ప్రభుత్వం తక్షణమే మానుకుని పరిష్కా రానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మికాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పారిశుధ్య కార్మిలకు అలవెన్సులు కొనసాగిస్తూ కనీస వేతనం రూ.21 వేలకు పెంచి… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనంపై కార్మిక సంఘాల నాయకులను వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల వలన రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు, ఇతర ప్రజానీకం ఆందోళన బాట పట్టారన్నారు. కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం డిసెంబర్ 7వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చిందని, గతంలో సమ్మె చేసినప్పుడు అంగీకరించిన అంశాలను ఇంతవరకు అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. జీతాల విష యంలో ప్రభుత్వం చాలా అన్యాయం చేసింద న్నారు. డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి సమ్మె చేయటానికి ముందు ప్రభుత్వం తూతూమంత్రంగా చర్చలు జరిపి వారం రోజుల సమయం కోరిందని, ప్రభుత్వం కోరిక మేరకు వారం రోజుల ఆగామని, తదుపరి చర్చలు కూడా నామమాత్రంగా జరిపి సమస్యలు పరిష్కరించలేదన్నారు. పారిశుధ్య కార్మికులు దాదాపు 35 వేల మంది ఉన్నారని, వీరు చేసే పని వేరొకరు చేయలేరన్నారు. కొద్దిమంది కార్మికులకు జీతాలు పెంచి దండిగా చేశామనే పద్ధతిలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెపుతోందని, ఇది సరైనది కాదన్నారు. కార్మికులు విధుల్లో చేరకుంటే తొలగిస్తామని ప్రభుత్వం కమిషనర్లు, కార్పొరేషన్ అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేల ద్వారా బెదిరిస్తున్నదని, బెదిరింపులకు భయపడే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను తొలగించి పనులు ప్రజాప్రతినిధులు, అధికారులతో చేయిస్తావా అని ప్రశ్నించారు. నూటికి 70 మంది కార్మికుల బలం కలిగిన ఏఐటీయూసీ అనుబంధ సంఘం సమ్మె చేస్తున్నదని, ఈ సమ్మెను దృష్టిలో పెట్టుకొని ప్రభు త్వం వెంటనే దిగిరావాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఓబులేసు హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యమాలపై నిర్బంధకాండ అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమాలు, పోరాటాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి మినిట్స్ రాసుకొని ఒప్పందం రాసిస్తేనే సమ్మె విర మణకు అంగీకరిస్తామని, లేకుంటే అంగీకరించేది లేదని, సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనం తరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుంచి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం మీదగా సమ్మె శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బందెల రవికుమార్, కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, యూనియన్ కోశాధికారి కోటి వీరాంజనేయులు, సద్గుణరావు, వెంట్రావు, విజయ్కుమార్, మల్లమ్మ, మరియమ్మ, ఏకుల సుబ్రమణ్యం, ఎలీషా రావు, మరియమ్మ, మేరి, ప్రసాద్, బందెల బాలాజీ, నారాయణ, రోశయ్య తదితరులు పాల్గొన్నారు.