. దేశ బహుళత్వం, వైవిధ్యంపై దాడి అంటున్న విపక్షాలు
. ప్రజల దృష్టి మళ్లించేందుకే: చిదంబరం
. ఎస్సీ, ఎస్టీలను ఆలయాల్లోకి అనుమతివ్వండి: డీఎంకే
న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ సర్కారు మరోసారి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు దేశ బహుళత్వం, వైవిధ్యంపై దాడి చేయడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి. దేశంలో యూసీసీ అమలుపై భోపాల్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. హిందూమతంలో ముందుగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని, దేశంలోని ప్రతి ఆలయంలో ఎస్టీలు, ఎస్సీలు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ డిమాండ్ చేశారు. యూసీసీ తమకు అవసరం లేదని, ఎందుకంటే రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ కల్పించిందని అన్నారు. మోదీ ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనపై కాంగ్రెస్ నేత పి.చిదంబరం బుధవారం విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్వేషపూరిత నేరాల సమస్యల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే మోదీ యూసీసీ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాజాన్ని విభజించేందుకు బీజేపీ యూసీసీని వాడుకుంటున్నదని మండిపడ్డారు. మోదీ సర్కార్ యూసీసీని ప్రజలపై బలవంతంగా రుద్దదని, ఎందుకంటే ప్రజల మధ్య విభజనను వ్యాప్తి చేయడమే దాని ప్రధాన అజెండా అని అన్నారు. యూసీసీని ఓ సాధారణ ప్రకియలా కనిపించేలా మోదీ చేస్తున్నారని, అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని గత లా కమిషన్ నివేదికను చదవాలని హితవు పలికారు. బీజేపీ మాటలు, చేతల కారణంగా దేశం విడిపోయిందని, ప్రజలపై విధించే యూసీసీ విభజనను మరింత విస్తృతం చేస్తుందని అన్నారు. సుపరిపాలన అందించడంలో విఫలమైన బీజేపీ… ఓటర్లను విభజించేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు యూసీసీ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిందని మండిపడ్డారు. యూసీసీని ఎక్కువ చేసి చూపించడానికి దేశాన్ని ఒక కుటుంబంతో ప్రధాని సమానం చేశారని, ప్రజల కోణంలో ఇది నిజమేననే భావన కలుగుతుందని, కానీ వాస్తవికతలో భిన్నంగా ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు. ఓ కుటుంబం రక్తసంబంధాలతో ముడిపడి ఉంటుందని, కానీ దేశం రాజ్యాంగం ద్వారా ఓ చోటకు చేర్చబడుతుందని అన్నారు. కుటుంబంలో వైవిధ్యమున్నట్లే, రాజ్యాంగం భారతదేశంలోని ప్రజల మధ్య వైవిధ్యం, భిన్నత్వానికి గుర్తింపునిచ్చిందని తెలిపారు.
ప్రధాని మొదట దేశంలో పెరుగుతున్న పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగంపై స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఒకవైపు మణిపూర్ మండిపోతోందని, కానీ ప్రధాని మణిపూర్ అంశంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ట్రిపుల్ తలాక్ అనేది ఇస్లాంలో విడదీయరాని భాగమైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. యూసీసీపై ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని తన ప్రసంగంలో ఆరోపించారు. ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉంటే ఒక కుటుంబంలా ఎలా పనిచేస్తుందని, అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి కావాలంటే దాన్ని పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టవచ్చని, వాళ్లను ఎవరు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. పార్లమెంట్లో యూసీసీని ప్రవేశపెట్టకుండా, ప్రతిపక్షాలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. భారత్లో ఉన్న బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని మోదీ సమస్యగా చూస్తున్నారని, యూసీసీ పేరుతో దేశ ఔన్నత్యాన్ని తగ్గిస్తారా అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.