. అభివృద్ధి ఏజెన్సీల ద్వారా అమరావతకి రూ.15 వేల కోట్లు
. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి భరోసా
. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు
. పారిశ్రామిక, కారిడార్ల అభివృద్ధికి సహకారం
. పూర్వోదయం పథకం కింద సహాయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి స్వల్ప ఊరట లభించింది. బడ్జెట్కు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తదితర ముఖ్య నేతలందరినీ కలిసి ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల ఏపీ అప్పుల ఊబిలో కూరుకోవడమే కాకుండా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని, తిరిగి గాడిన పెట్టాలంటే కేంద్రం ఆదుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుల ప్రాధాన్యతలను ప్రధానికి సీఎం వివరించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం టీడీపీ పాత్ర ప్రముఖంగా ఉండడంతో తప్పకుండా భారీ సహాయం లభించే అవకాశం ఉందని టీడీపీ, జనసేన నేతలు భావించారు. అయితే వీరు ఆశించిన మేర కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా లేనప్పటికీ, పరోక్ష సహకారానికి హామీలు లభించాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి, అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సహాయం వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా అవసరాన్ని బట్టి భవిష్యత్లో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని తెలిపారు. ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తాం’ అని నిర్మలమ్మ భరోసానిచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల సరసన రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రకాశం జిల్లాను కూడా కలిపి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని తెలిపారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ`చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు. విదేశీ సంస్థల సాయంతో అమలయ్యే వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి నిధులు అందించనున్నారు. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి సాయం అందించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్, ఆంధ్ర ప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్స్, ఆంధ్ర ప్రదేశ్ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్టులకు విదేశీ సంస్థల నుంచి సాయం అందనుంది. అలాగే కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాలోనూ పెరుగుదల ఉంటుందని మంత్రి తెలిపారు. దీని ప్రకారం 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్రం పన్నుల్లో ఏపీ పన్నుల వాటా రూ.50,474 కోట్లు రానుంది. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ.620 కోట్లు కేటాయించారు. పూర్వోదయం పథకం కింద కూడా ఏపీకి సహాయం చేయనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. ఇలా మొత్తానికి ప్రత్యక్ష కేటాయింపులు పెద్దగా చేయకుండానే కేంద్రం వ్యూహాత్మకంగా సహాయం చేసినట్లుగా చెప్పుకుంటూ వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా నిధులు ఇప్పించి, రాష్ట్ర్రంపై మరింత అప్పుల భారాన్ని మోపే యత్నం చేసింది.