నేడు అంతరిక్షనౌక ప్రయోగం
బీజింగ్: ఇప్పటివరకు ఎవరూ చూడని చంద్రుని దక్షిణ అర్ధగోళం నుండి మొట్టమొదటి మట్టి, రాతి నమూనాలను సేకరించడానికి చైనా సమాయత్తమైంది. ఇందుకోసం చాంగే-6 అంతరిక్షనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. లాంగ్ మార్చ్-5 వై8 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతామని పేర్కొంది. హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం ఇందుకు వేదికకానుంది. చంద్రునిపై దిగాల్సిన ఈ అంతరిక్ష నౌక ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుండి శాస్త్రీయ పరికరాలను మోసుకెళుతోంది. దీని బరువు 3,200 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చాంగే-6లో ఆర్బిటర్, ల్యాండర్ ఉంటాయి. ల్యాండర్లో ఐరోపా దేశాలకు చెందిన పరికరాలు ఉంటాయి. ఆర్బిటర్లో పాకిస్థాన్కు చెందిన పేలోడ్ కూడా ఉంది. 2030 నాటికల్లా చంద్రుడిపైకి మానవసహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.