ఇలాగే ఉంటే మాకు భవిష్యత్ ఉండదు
యూరప్ రైతుల ఆందోళన
బ్రసెల్స్లో ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తం
బ్రసెల్స్: తమ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాల్సిందే అని యూరప్ రైతులు ముక్త కంఠంతో పాలకులను డిమాండ్ చేశారు. తమ మనుగడ కష్టసాధ్యంగా మారిందని, ఇవే పరిస్థితులు కొనసాగితే తమకు భవిష్యత్ ఉండదని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తమ డిమాండ్ల సాధన కోసం వీధి పోరాటానికి దిగారు. ఇదే క్రమంలో బ్రసెల్స్లో రైతుల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. 900 ట్రాక్టర్లతో బెల్జియం రాజధానిలోకి ప్రవేశించి ప్రధాన మార్గాలన్నింటిని రైతులు దిగ్బంధించారు. ఈయూ వ్యవసాయ మంత్రుల సమావేశం నేపథ్యంలో ఈయూ కేంద్ర కార్యాలయాన్ని దిగ్బంధించేందుకు యత్నించారు. వీరిని భవనం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది అడ్డుకోగా, ఆగ్రహించిన రైతులు పేడ, గుడ్లు, సీసాలను పోలీసులపైకి విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. రైతులను అడ్డుకునేందుకు ముళ్లకంచెలు, కాంక్రీటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బాష్పవాయువు, జల ఫిరంగులను సోయుధ పోలీసులు ప్రయోగించారు. కొందరు నిరసనకారులు టైర్లకు నిప్పు పెట్టారు. వ్యవసాయ మంత్రుల సమావేశం క్రమంలో రైతుల సబ్సిడీలు పెంచాలని ప్రభుత్వానికి మంత్రులు సూచించినట్లు సమాచారం. రైతు ప్రతినిధులతో చర్చలకూ ప్రభుత్వ అధికారులు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, వ్యవసాయం… అనేది తమ బిడ్డ అని, దాని కోసం ప్రాణాలు వదిలేస్తామని రైతులు తేల్చిచెప్పారు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టే ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు.
ఇదిలావుంటే, ఫెడరేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ట్రేడ్ యూనియన్స్ (ఎఫ్యూజీఈఏ), ది వల్లోనియన్ అగ్రికల్చరల్ ఫెడరేషన్ (ఎఫ్డబ్ల్యూఏ), ది యంగ్ ఫార్మర్స్ ఫెడరేషన్ (ఎఫ్జేఏ), యూరోపియన్ కోఆర్డినేషన్ వయా కాంపెసినా (ఈసీవీసీ)తో పాటు కార్మిక సంఘాల పిలుపుతో బ్రసెల్స్ ర్యాలీ జరిగింది. ఈయూ వ్యవసాయ విధానంలో మార్పులు చేయాలని, ఆంక్షల తొలగించాలని, ఉక్రెయిన్ నుంచి చౌకగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, పోలాండ్, రొమేనియా, నెథర్లాండ్స్లో రైతుల ఆందోళనలు పెద్దఎత్తున సాగుతున్నాయి.