పత్తికొండ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి
విశాలాంధ్ర -ఆస్పరి : నేరాల అదుపునకే కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని పత్తికొండ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని బిల్లేకల్లు గ్రామంలో ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంను డిఎస్పి ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మొహరం పండగ సందర్భంగా బిల్లేకల్లు సమస్యాత్మక గ్రామం కావడంతో ప్రజల రక్షణ, వారికి భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించేందుకు కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరుస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందన్నారు. నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కార్డెన్సెర్చ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెంట్ తప్పకుండా ధరించాలని వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. పాత వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు డాక్యు మెంట్లు చెక్ చేసుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, మద్యం సేవించి వాహనాలను నడ పొద్దని సూచించారు. చాలా మంది యువత ఆన్లైన్ మోసాలకు బలి అవుతున్నారని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో హనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్డెన్ సర్చ్ లో భాగంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లడం జరిగింది. అలాగే గ్రామ సమీపంలో ఉన్న కొండలో 50 లీ. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సీఐ వెంకటేశులు, పత్తికొండ టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి, తాలూకా సిఐ మురళీమోహన్, ఆస్పరి ఎస్సై వరప్రసాద్ తో పాటు నలుగురు ఎస్సైలు 20 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.