. ఏపీ రైతు సంఘం నేతల డిమాండ్
విశాలాంధ్ర – ఆస్పరి : తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేలు సాగు సాయం అందించాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే.తిమ్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తాలూక రౌండ్టేబుల్ సమావేశాన్ని ఏపీ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు నాగేంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు భూ యాజమాన్యంతో ప్రమేయం లేకుండానే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి సాయం చేయాలని, రెండు లక్షల రూపాయలు వరకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడవ స్థానంలో ఉందని, వారిలో అత్యధికులు కౌలు రైతులే ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయని ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అటకెక్కించారని ఆరోపించారు. రైతు సంఘాలు కోరుతున్నట్లు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. మరోపక్క ప్రతి సంవత్సరం సాగు ఖర్చు పెరుగుతూనే ఉందన్నా రు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి రెండు ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు రూ.20 వేల వరకు పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 24వ తేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం అలాగే 30వ తేదీన అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాలూకా నాయకులు హోతురప్ప, ఉరుకుందప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బ్రహ్మయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఏఐటీయూసీ నాయకులు హనుమంతు, చంద్రశేఖర్, పాండు, గోవిందు, పెద్దయ్య, మల్లికార్జున, నాగరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.