సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతున్న కాషాయ పార్టీ బీజేపీ ఈ ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో అసలు పోటీనే చేయడంలేదు. బీజేపీ పోటీచేయని రాష్ట్రాలలో లక్షద్వీప్, మేఘాలయ, నాగాలాండ్, కశ్మీర్ ఉన్నాయి. అక్కడి 7 సీట్లు మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలలో అయినా బీజేపీ పోటీచేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 443 స్థానాల్లో ఆ పార్టీ పోటీపడుతోంది. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, రaార్ఖండ్, కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, మణిపుర్, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్లో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకొని పోటీలోకి దిగింది. మిగతాచోట్ల ఒంటరిగానే పోటీపడుతోంది. 1996లో 471 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీచేసింది. ఆ తర్వాత ఇన్ని నియోజకవర్గాల్లో కాషాయపార్టీ పోటీ చేయడం ఇదే ప్రథమం.
370 అధికరణాన్ని రద్దు చేశాక కశ్మీర్ ప్రాంతంలో జరుగుతున్న తొలి ఎన్నికలకు బీజేపీ దూరంగా ఉంది. అక్కడున్న మూడు సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపలేదు. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోలేదు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్ లోయలోని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. తాము ఇక్కడ దేశభక్త పార్టీలకు మద్దతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా ప్రకటించారు. జమ్మూలోని రెండు స్థానాల నుంచి మాత్రం బీజేపీ పోటీలో ఉంది. అనంత్నాగ్-రాజౌరీ, శ్రీనగర్, బారాముల్లా స్థానాల నుంచి కాంగ్రెస్ కూడా పోటీచేయడం లేదు. పొత్తులో భాగంగా వాటిని నేషనల్ కాన్ఫరెన్స్కు కేటాయించింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ అక్కడ ఒంటరిగా పోటీచేస్తోంది.
మేఘాలయలోని రెండు సీట్లను ఎన్డీయే మిత్రపక్షం నేషనల్ పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్లోని ఒక్క సీటును నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి, లక్షద్వీప్లోని ఒక సీటును అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి బీజేపీ కేటాయించింది. ఇవి మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడోచోట కమలం పార్టీ రంగంలోకి దిగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 443 స్థానాల్లో పోటీచేస్తున్న కాషాయ పార్టీ ఇప్పటివరకు 435 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఉత్తర్ప్రదేశ్లోని రాయబరేలి, కైసర్గంజ్ స్థానాలున్నాయి. రాయబరేలి నుంచి కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థిని చూశాక బలమైన ప్రత్యర్థిని దించాలని బీజేపీ భావిస్తోంది.
కైసర్గంజ్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వివాదాస్పద నేత, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ను కొనసాగించాలా? మరో అభ్యర్థిని రంగంలోకి దించాలా? అని ఆ పార్టీ తలబాదుకుంటోంది. బ్రిజ్భూషణ్పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.