ఆర్వీ రామారావ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల వ్యూహకర్త మాత్రమే కాదు జనాన్ని పక్కదారి పట్టించడంలో కూడా దిట్ట. గురువారం పార్లమెంటులో దిల్లీలో ఉన్నతోద్యుగులను నియమించే అధికారాన్ని ఆ ప్రభుత్వం నుంచి లాగేసుకోవడానికి ప్రవేశపెట్టిన బిల్లుమీద చర్చలో పాల్గొంటూ ఆ బిల్లును సమర్థించడానికి కేటాయించిన సమయంకన్నా ప్రతిపక్ష ఫ్రంట్ ‘‘ఇండియా’’ను దుయ్యబట్టడానికే ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతిపక్షాలు దిల్లీ గురించి ఆలోచించాలి తప్ప కొత్తగా ఏర్పాటు అయిన ‘‘ఇండియా’’ ఫ్రంట్ గురించి కాదు అని ఆయన దెప్పి పొడిచారు. దేశ రాజధానిలో ఉన్నతాధికారుల నియామకం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండడం కోసం ప్రతిపాదించిన ఈ బిల్లును సమర్థించే క్రమంలో ఆయన ప్రతిపక్షాలను తూర్పారబట్టడానికే ఎక్కువ సమయం కేటాయించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ‘‘ఇండియా’’ తో కలిసి నడవడం అమిత్ షా జీర్ణించుకోలేక పోతున్నారు. అందువల్ల అన్ని ప్రతిపక్షాల మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామక అధికారం కేంద్ర దిల్లీ ప్రభుత్వం తీర్పు చెప్పిన అంశాన్ని పక్కదారిపట్టించి మరో సందర్భంలో సుప్రీంకోర్టు జాతీయ రాజధాని ప్రాంతమైన దిల్లికి సంబంధించి చట్టాలుచేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందన్న ముక్కను వాటంగా వినియోగించుకున్నారు. దిల్లీకి సంబంధించి చట్టాలుచేసేఅవకాశం రాజ్యాంగమే ఇచ్చిందనికూడా చెప్పారు. ఈ బిల్లుని వ్యతిరేకించడం అంటే అవినీతి మయమైన దిల్లీ ప్రభుత్వాన్ని సమర్థించడంగా దిగజార్చారు. అందువల్ల ఆ అవినీతి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని ప్రతిపక్షాలకు హితబోధ కూడా చేశారు. మీరు ఒక ఫ్రంట్గా ఏర్పడి ఉండవచ్చు కానీ కేజ్రీవాల్కు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అంతటితో ఆగలేదు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేసినా వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుస్తారు అని ఢంకా మీద దెబ్బవేసి జోస్యం చెప్పి స్వామిభక్తి నిరూపించుకున్నారు. బిల్లు గురించికన్నా రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని చేరదీయడానికి ప్రతిపక్ష కూటమి అనేక ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.
2015లో ఒక పార్టీ (పేరు చెప్పలేదు) అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కేంద్రంతో ఘర్షణ పడుతోందని, ప్రజలకు ఉపకరించడం లేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉన్నతోద్యోగుల నియామకం, బదిలీల మీద తమకు అధికారం ఉండాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం కాదని తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి విజిలెన్స్ విభాగం తమ గుప్పెట్లో ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోందని వారు పెద్ద పెద్ద బంగళాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లును సమర్థించడం కోసం ఆయన పండిత్ నెహ్రూ, సర్దార్ వల్లభ భాయి పటేల్, రాజేంద్ర ప్రసాద్, బి.ఆర్.అంబేద్కర్ పేర్లన్నీ ఏకరువు పెట్టి దిల్లీకి రాష్ట్ర స్థాయి ఉండకూడదని సమర్థించుకున్నారు. వీరందరూ దిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి ఉండకూడదని అన్నారని నమ్మబలికారు. ఈ బిల్లు నెహ్రూ అభిప్రాయాల మేరకే రూపొందిందని బుకాయించారు.
2015లో దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా వివిధ పార్టీల నేతృత్వంలో పరిపాలన సజావుగా సాగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు తరవాత కేంద్రం జారీచేసిన ఆర్డినెన్సును వ్యతిరేకించడానికి కాంగ్రెస్ నాయకుడుజ్ అధీర్ రంజన్ చౌదరి, సౌగతా రాయ్, ఎన్.కె.ప్రేం చంద్రన్, సుశీల్ కుమార్ రింకు, అసదుద్దీన్ ఒవైసీ లోకసభలో తీర్మానం ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నారు. కానీ ఆర్డినెన్సు దశ దాటి బిల్లు ప్రతిపాదించిన తరవాత తీర్మానంవల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. దిల్లీ ప్రభుతం లేదా ఆమ్ ఆద్మీ పార్టీతో ఎవరైనా విభేదించవచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తరవాత వైద్యం, మంచి నీరు, విద్యుత్ బిల్లుల విషయంలో ఉచితంగా వీటిని అందించడం ప్రజల మన్నన పొందాయి. వీటివల్ల ప్రజలకు సదుపాయం కలిగింది. దిల్లీ పాఠశాలలు మెరుగయ్యాయన్నది నిర్వివాదాంశం. ఈ పథకాలు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించాయి. ఇవేవీ అమిత్ షాకు కనిపించడం లేదు. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్నా దేశ రాజధాని తమ అధీనంలో లేకపోవడాన్ని బీజేపీ సహించలేక పోతోంది.
దిల్లీకి సంబంధించిన బిల్లు ఉభయసభల ఆమోదం పొందితే ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీ ఇలాంటి పనిచేసే అవకాశం ఉంది. బీజేపీకి కావల్సింది అన్ని చోట్లా సంపూర్ణ అధికారం. ‘‘కాంగ్రెస్ ముక్త్ భరత్’’ అన్న బీజేపీ నినాదం ఇప్పుడు ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’’ రూపం దాల్చింది. ఇదే నిరంకుశ ధోరణి.