ప్రధాన పార్టీల హోరాహోరీ
ద్వితీయ శ్రేణి నాయకుల ఫిరాయింపుల జోరు
రాజకీయ ఉద్దండుల కోట… పౌరుషాల పురిటిగడ్డ…. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట. నరసరావు పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగబోతోంది. ఇండియా కూటమి తరుపున జి.అలెగ్జాండర్ సుధాకర్ పోటీ చేస్తుండగా ఎన్డీయే తరపున టీడీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ తరపున పి.అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరగబోతోంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు సొంత అజెండాలతో ఒంటెద్దు పోకడలు పోతున్నారన్న అభిప్రాయం స్థానికుల్లో ఉన్నది. దీంతో ఇండియా కూటమికి మొగ్గు చూపే అకాశాలు ఉన్నాయి. ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ మాత్రమే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ద్వితీయశ్రేణి నాయకులు పూటకో పార్టీ మారుతూ అభ్యర్థులకు రaలక్ ఇస్తున్నారు.
వైసీపీ, టీడీపీ తరపున స్థానికేతరులు బరిలో నిలిచారు. వీరిలో ఒకరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాగా మరొకరు ఎంపీ.నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచి…రెండు నెలల కిందట వైసీపీ ఉన్న లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 1,607 ఓట్లతో గెలిచారు. ప్రస్తుతం అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములను వారి సామాజిక వర్గం ఓట్లు నిర్దేశిస్తాయన్న అభిప్రాయమున్నది.
1952లో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిరది. తొలి ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఆర్ చౌదరి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై జరిగిన ఎన్నికల్లో మూడుసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు కాంగ్రెస్ ఐ, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. సామాజిక వర్గం ఆధారంగా చూస్తే… ఏడుసార్లు రెడ్డి సామాజిక వర్గం, ఐదుసార్లు కమ్మవారు, మూడుసార్లు వైశ్య సామాజిక వర్గ అభ్యర్థులు గెలుపొందారు. గతంలో నరసరావుపేటకు ప్రాతినిధ్యం వహించిన కాసు బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా పనిచేశారు. ఎన్.జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య కూడా ముఖ్యమంత్రులయ్యారు. దీంతో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి రాజకీయాల్లో ప్రత్యేక స్థానం దక్కింది. తాజా ఎన్నికల్లో బీసీ యాదవ్ అభ్యర్థిని వైసీపీ నిలబెట్టింది. నియోజకవర్గంలో యాదవుల ఓట్లు 1.17 లక్షల మేర ఉన్నాయి. రెడ్డి వర్గం ఓట్లు 2.15 లక్షలుగా ఉన్నాయి. నరసరావు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని అనిల్ కుమార్ యాదవ్ దీమాగా ఉన్నారు. మరోవైపు ఐదేళ్లులో ఎంపీగా తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయని లావు శ్రీకృష్ణదేవరాయలు భావిస్తున్నారు. ఒంటెద్దు పోకడలు పోతున్న స్థానికేతర అభ్యర్థులను కాకుండా స్థానికుడైన ఇండియా కూటమి అభ్యర్థిని గెలుపించుకోవాలన్న అభిప్రాయం స్థానికుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
` విశాలాంధ్ర బ్యూరో, పల్నాడు జిల్లా