విశాలాంధ్ర,పార్వతీపురం: ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని జాయింట్ కలెక్టరు ఎస్. ఎస్.శోబిక అన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు తహశీల్దార్లు, ఇతర ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టరు మంగళవారం వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అందరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఎక్కడా ప్రవర్తనా నియమావళి అమల్లో నిర్లక్ష్యం ఉండరాదని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎవరు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని అన్నారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టుటకు దృష్టి సారించాలని, ఎక్కడా లోపాలు ఉండరాదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఎంసీసీ బృందాలు, వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఎఫ్.ఎస్.టి, వీఎస్టీ, వీవీటీ, ఎస్.ఎస్.టి. బృందాలు తమ నివేదికను ఎన్నికల కమిషను నిర్దేశించిన సమయంలోగా పంపించాలని ఆదేశించారు.ఎన్నికల కమీషన్ నియమాలు తూ.చ తప్పక పాటించాలని కోరారు.గ్రామ, మండలస్థాయిలో ఎన్నికల నియమావళి పర్యవేక్షణ పక్కాగా ఉండాలని ఆదేశించారు. నివేదికల సమర్పణలో ఎటువంటి జాప్యం ఉండరాదన్నారు. ఈవీడియో కన్ఫరెన్స్ లో వివిధ మండల తహశీల్దార్ లు పాల్గొన్నారు.