తెలంగాణలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా.. ఈ 13 నియోజవకర్గాలు మినహా.. మిగిలిన స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని సమస్యాత్మకమైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక,, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందుల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అకాశం కల్పించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 39.92 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 62.44 శాతం పోలిగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 29.47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.