. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయ్
. బీజేపీకి 370 సీట్లు పక్కా
. కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూదిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటోంది. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను మళ్లీ తెరపైకి తెచ్చింది. రానున్న లోక్సభ ఎన్నికలలోపు పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశంలో అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. ఎన్నికల ముందే దీనిని నోటిఫై చేసి అమలు చేస్తామని అమిత్ షా తెలిపారు. ఈ చట్టాన్ని డిసెంబర్ 2019లో పార్లమెంట్ ఆమోదించిందని, సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని హరించదన్నారు. సీఏఏ బంగ్లాదేశ్, పాకిస్థాన్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించే చట్టమని అమిత్షా చెప్పుకొచ్చారు.ఈ చట్టానికి సంబంధించి నియమాలు జారీ చేస్తామన్నారు. ఈ చట్టంపై ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024లో పాల్గొన్న అమిత్ షా… సీఏఏ సహా అనేక రాజకీయ అంశాలపై మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి 400కు పైగా సీట్లు సాధించి మోదీ నేతృత్వంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ ఏమీ లేదని, ఈసారి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలన్నీ విపక్ష స్థానంలోనే ఉంటాయన్నారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని తమ ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ కారణంగానే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడంపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు షా స్పందిస్తూ… బీజేపీ కుటుంబ నియంత్రణను నమ్ముతోందని, కానీ అది రాజకీయాల్లో కాదన్నారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై స్పందించిన అమిత్ షా… 1947లో దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఇలాంటి పాదయాత్రను కొనసాగించే హక్కు నెహ్రూ-గాంధీ వారసులకు లేదన్నారు. పార్లమెంట్లో శ్వేతపత్రం విడుదల చేయడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి దేశం ముందు ఎలాంటి గందరగోళ పరిస్థితిని మిగిల్చిందో తెలుసుకునే హక్కు దేశానికి ఉందన్నారు. 2014లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, మోసాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తోందని అమిత్ షా అన్నారు. భారీస్థాయిలో విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చిందన్నారు. ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. అందుకే ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. ఇదే సమయంలో రామమందిరం గురించి కూడా అమిత్ షా ప్రస్తావిస్తూ రామ జన్మభూమిలో గుడి కట్టాలన్నది 500 ఏళ్లుగా ప్రజల డిమాండ్ ఉందని, కానీ బుజ్జగింపు రాజకీయాలు, శాంతిభద్రతలను నెలకొల్పే ఉద్దేశంతో రామమందిర నిర్మాణానికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రామ మందిరాన్ని పూర్తి చేసిందని చెప్పారు.