ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అడవులను సంరక్షించుకోవలసిన బాధ్యత మన్య ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిపై ఉందని, తద్వారా నీటి వనరులు తగ్గిపోకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి అన్నారు. పాడేరు, చింతపల్లి డీఎఫ్ఓ లు వినోద్ కుమార్, సిహెచ్ సూర్య నారాయణ, స్క్వాడ్ డీ ఎఫ్ ఓ సోమసుందర్ లతో కలసి ఆదివారం చింతపల్లి అటవీశాఖ కార్యాలయం, ఆర్ వి నగర్ పాత టేకు ప్లాంటేషన్, చింతలూరు కలప డిపోలను సందర్శిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిలో అటవీశాఖ డివిజనల్ కార్యాలయం నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ఇక్కడ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రూ.90 లక్షల నిధులతో అటవీశాఖ కార్యాలయం, రూ.60 లక్షల నిధులతో ఉద్యోగుల నివాసగృహాలను నూతనంగా నిర్మిస్తున్నామన్నారు. అటవీశాఖ సిబ్బంది అడవుల్లోకి తరుచు వెళ్లాలని, కొందరు ఆకతాయిలు అడవులకు నిప్పు పెట్టడం వలన అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయన్నారు. అడవులను రక్షించే బాధ్యత మన్య ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిపై ఉందని, అడవుల్లో నీటి వనరులు తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ కంటనాదరెడ్డి, సబ్ డీఎఫ్ ఓ ఎన్ఎస్వీ రాజు, స్థానిక రేంజ్ అధికారి ఎల్బీకే పాత్రుడు, డీఆర్వో వెంకటరాజు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.