1వ తేది 6గంటలకే తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నాం
ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం…ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
విశాలాంధ్ర – అనంతపురం : ఇచ్చిన మాట తప్పేది లేదు.. టైం అంటే టైమే.. 1వ తేది వచ్చిందంటే.. 6గంటలకే తలుపు తట్టి పింఛన్లు ఇస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచే ఆయన పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అర్బన్ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ తర్వాత అరవింద్ నగర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే స్వయంగా ప్రతి కాలనీకి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతపురం నగరంలోని అరవింద్ నగర్, ఆదర్శ నగర్, హమాలీ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బుడ్డప్ప నగర్, సంగమేష్ నగర్, సూర్య నగర్, కమలానగర్, డిసిఎంఎస్ రోడ్డు ఏరియాలలో ప్రతి ఒక్క లబ్ధిదారునితో ఆయన నేరుగా మాట్లాడుతూ వారి స్పందన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ మొదటి రోజే రికార్డ్ స్థాయిలో పింఛన్లు పంపిణీ చేశామని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనత అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కైనా ఒకరోజు ఆలస్యంగా వేతనాలు అందుతాయేమో కానీ పింఛన్దారులకు మాత్రం ఖచ్చితంగా ఒకటవ తేదీ ఉదయం 6 గంటలకు పింఛన్ అందిస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి ఐదు సంతకాల హామీలలో ప్రతి ఒక్కటి నెరవేస్తున్నామని మిగిలిన వాటిని కూడా కచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పింఛన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు ఉదయం 6 గంటలకు తలుపు తట్టి ఇస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.