విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లో ప్రపంచ సికిల్ సెల్ డే ని పురస్కరించుకొని బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ప్రభుతా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ అప్పలనాయిడు మాట్లాడుతూ సికిల్ సెల్ వ్యాధి సాధారణంగా వారసత్వంగా వచ్చే హిమోగ్లోబిన్-సంబంధిత రక్త రుగ్మతల సమూహం అని, ఇది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఆక్సిజన్-వాహక ప్రోటీన్ హిమోగ్లోబిన్లో అసాధారణతను కలిగిస్తుందని, దీనిద్వారా ప్రపంచం లో ఎంతో మంది యిబ్బంది పడుతున్నారు అని తెలిపారు. దీనిని సమయానుకూల రక్త పరీక్షలు, క్రమం తప్పకుండా మందులను వాడడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, మంచి జీవనశైలిని కలిగిఉండడం వంటి వాటి వల్ల సమర్ధవంతంగా నిర్వహించుకోవచ్చు తెలిపారు.
అనంతరం విశాఖపట్నం కాన్సర్ హాస్పిటల్ హెమటాలజిస్ట్ డాక్టర్ రమేష్ ఉప్పాడ మాట్లాడుతూ సీకిల్ సెల్ నిర్వహణకు మంచి మందులు అందుబాటులో వున్నాయని దీనికి స్టెమ్ సెల్ థెరపీ అనే నూతన వైద్య విధానం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీల మాట్లాడుతూ దీని నిర్వహణ కొరకు ప్రభుత్వం నెల నెలా పది వేల రూపాయను అందిస్తుందని ఇదేకాకుండా వారికి కావలసిన రక్తాన్ని వివిధ ఎన్జీవోలు కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకొని అనీమియా రోగులు ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ తేజస్వి కట్టిమని మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా అనేది జన్యుపరమైన రక్త వ్యాధి అని ఇది బాధిత రోగియొక్క మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుందని దీని నిర్వహణా పద్దతులుపై పరిశోదనలు జరపడానికి ఐ సి ఏం ఆర్, న్యూ ఢిల్లీ వారి సహకారంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం వొక ప్రాజెక్టును బయోటెక్నాలజీ హెడ్ డాక్టర్ పరికిపండ్ల శ్రీదేవి ఆద్వర్యం లో అరకు మరియు పాడేరు ప్రాంతాలలో నిర్వహిస్తోందని తెలిపారు. తలసేమియా, సీకిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు తమ యూనివర్సిటీ లో ఉచిత విద్యా, హాస్టల్ వసతి మరియు పుస్తకాలను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమము లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. తంత్రవాహి శ్రీనివాసన్, డీన్లు ప్రొ. శరత్చంద్ర బాబు, జితేంద్ర మోహన్ మిశ్రా, పరీక్షల అధికారి ప్రొ.స్.బి.కివాడే, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ దాస్, డా.దివ్య, డా.నగేష్ తదితర ఆద్యాపక ఆద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీకిల్ సెల్ అనీమియా రోగులను, సహాయకులను తన ఛాంబర్ కి పిలిపించుకొని వారిలో ముచ్చటించి ఆత్మవిశ్వాసన్ని నింపారు.