జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం, రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులతో ఆర్టీసి కాంప్లెక్స్ నుండి సి.ఎం.ఆర్. జంక్షన్ వరకుర్యాలీ నిర్వహించి, యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక పిలుపునిచ్చారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో విజయనగరం 1వ, 2వ పట్టణ, రూరల్, ఆర్మ్ డ్ రిజర్వు పోలీసులు, వివిధ కళాశాలకు చెందిన విద్యార్ధులు, విజయనగరం పట్టణం ఆర్టీసి కాంప్లెక్సు నుండి సి.ఎం.ఆర్.వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, ప్రజలకు, యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలు పట్ల అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణ, వినియోగించే వారి సమాచారాన్ని డయల్ 100 లేదా టాస్క్ ఫోర్స్ సిఐ – 9121109416 కు అందించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణ కేసుల్లో ఎవరైనా యువత ఒకసారి చిక్కుకొని, అరెస్టు అయినట్లయితే, ఇక వారి భవిష్యత్తు నాశనమైనట్లేనన్నారు. నిందితులపై నేరం రుజువు అయినట్లయితే 10సం.లకు పైబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణ కేసుల్లో నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. చెడు సహవాసాలతో, వ్యసనాలకు యువత బానిసై లక్ష్యంకు దూరం కావద్దన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడే యువత శారీరక రుగ్మతలకులోనై, జ్ఞాపకశక్తి కోల్పోయి, విచక్షణ, విజ్ఞత కోల్పోయి, నేరాలకు పాల్పడుతూ, దురదృష్టవసాత్తు కేసుల్లో నిందితులుగా మారుతూ, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాను మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు, యువతకు మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు, విద్యా సంస్థలు,ముఖ్య కూడళ్ళులో హెూర్డింగులను, ప్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను విద్యార్ధులు, ప్రజలు, యువతకు వివరిస్తూ, స్థానిక పోలీసులు కళాశాలలు, పాఠశాలలను సందర్శించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణం ఆర్టీసి కాంప్లెక్స్ నుండి రైల్వే స్టేషను మీదుగా సి.ఎం.ఆర్. జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్ళి, మానవ హారంగా ఏర్పడి, మత్తుపదార్ధాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రతిజ్ఞ చేసారు. ఆర్టీసి కాంప్లెక్సు వద్ద ఈ ర్యాలీని అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అస్మా ఫర్హీన్, విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, 1వ పట్టణ సిఐ బి. వెంకటరావు, 2వ పట్టణ సిఐ కె.రామారావు, ఎస్బీ సీఐ కె.కె.వి.విజయనాధ్, సిసిఎస్ సిఐ సత్యన్నారాయణ, ఆర్ ఐ లు ఎన్. గోపాల నాయుడు, ఆర్. రమేష్ కుమార్, భగవాన్, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేశల అప్పారావు, సైకాలజిస్టు డా. హిమబిందు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.