నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించే విధంగా బాధ్యత తీసుకోవాలని ఎడ్యుకేషన్ కార్యదర్శులకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయం కార్యదర్శులు మరియు నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లలను గుర్తించే భాద్యత ఎడ్యుకేషన్ కార్యదర్శులదే నని అన్నారు. ప్రతి హ్యాబిటేషన్ పరిధిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ సహకారంతో గుర్తించిన వారిని బడిలో చేర్పించే విధంగా చూడాలన్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులలో కూడా సంపూర్ణ చైతన్యం తీసుకురావాలన్నారు. నూతనంగా బడిలో చేరిన పిల్లల సామర్థ్యాల మదింపును చేపట్టాలన్నారు. వయసుకు తగిన తరగతిలో చేర్పించి ఆ తరగతి స్థాయి అందుకునేందుకు బ్రిడ్జి కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడమే కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేరే విధంగా చూడాలన్నారు. బడిలో చేరిన పిల్లలకు అవసరమైన పుస్తకాలు విద్యా కిట్టులను అందించడమే కాకుండా ప్రోత్సాహకాలు కూడా అందుతాయన్న విషయాన్ని తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. అందరి సహకారంతో శతశాతం బడి ఈడు పిల్లలు పాఠశాలలో చేరే విధానానికి కృషి చేయాలి అన్నారు. పిల్లలు పని లోకి కాకుండా బడిలో ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తగ్గట్లుగా “నేను బడికి పోతా” అన్న నినాద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారులు ఆనందమూర్తి, సత్యవతి, నగర పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజిబివి ఇన్చార్జి,ఐసిడిఎస్ సూపర్వైజర్ పాల్గొన్నారు.